కొత్తపల్లి, మార్చి 10 : రాష్ట్ర స్థాయి హాకీ టోర్నీలో కరీంనగర్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం ఖమ్మంతో జరిగిన క్వార్టర్స్లో కరీంనగర్ జట్టు 9-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్లో మహబూబ్నగర్ 3-1(పెనాల్టీ షూటౌట్) తేడాతో మెదక్పై గెలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల మధ్య స్కోరు 1-1తో సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. అంతకుముందు షణ్ముక్సింగ్, జస్వంత్సింగ్ స్మారకార్థం కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల హాకీ టోర్నీని ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్కుమార్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్(టోక్యో)లో భారత్ కాంస్య పతకం సాధించడం ద్వారా దేశంలో ఆటకు పునర్వైభవం వచ్చిందన్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్లేయర్లకు ఆయన సూచించాడు. ఈ కార్యక్రమంలో మాజీ ఒలింపియన్ ఎడ్వర్డ్ అలోసియస్, జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్సింగ్, డీవైఎస్వో రాజవీరు, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.