కరీంనగర్, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత యువతకు సర్కారీ కొలువంటే కలే. నోటిఫికేషన్లు వచ్చినా.. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా.. నాడు వివిధ కేడర్లోని పోస్టులను స్థానికేతరులు ఎగరేసుకొని పోయే వాళ్లు. ప్రతిసారీ మనకు అ న్యాయమే జరిగేది. కానీ, స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు మన ప్రాంత బిడ్డలకే దక్కాలన్న సంకల్పంతో పాత జోన ల్ వ్యవస్థను సమూలంగా మార్చడంపై దృష్టి పెట్టారు. అప్పటి జోనల్ వ్యవస్థ విధానంలో ఉన్న లోపాలు.. తద్వారా జరుగుతున్న నష్టం, కొన్ని ప్రాంతాల వాసులకే ఉద్యోగ అవకాశాలు దక్కడం, మారుమూల జిల్లాలు, మండలాల యువతకు ఉద్యోగావకాశాలు దక్కకపోవ డం… వీటితో పాటు ఉద్యోగోన్నతులు, బదిలీల విషయంలో శాస్త్రీయత లోపించడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. పాత జోనల్ వ్య వస్థను సమూలంగా మార్చేందుకు 2018లోనే శ్రీకా రం చుట్టారు.
ఆ తదుపరి ఏర్పడిన ములుగు, నారాయణపేట జిల్లాలను కలుపుకొని.. మొత్తం 33 జిల్లాల పరిధిలో జోనల్ విధానానికి ఆమోదం కోరుతూ 2019లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ వెంటనే ఆమోద ముద్ర వేయాల్సిన కేంద్రం ఈ విషయంలో రెండేళ్ల పాటు తాత్సారం చేసింది. తెలంగాణపై వివక్ష చూపింది. దాని వల్ల ఉద్యోగ ప్రకటన జారీ కావడం ఆలస్యమైంది. కానీ, సీఎం కేసీఆర్ పట్టు విడువకుండా.. చిత్తశుద్ధితో ప్రయ త్నించడంతో గతేడాది ఆగస్టులో కొత్త జోనల్ వ్యవస్థకు అమోద ముద్ర వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం వెంటనే ఆమోదించి ఉంటే.. ఈ పాటికే రిక్రూట్మెంట్ల ప్రక్రియ పూర్తయ్యేది.
మూడు జోన్లలోకి ఉమ్మడి జిల్లా..
కొత్త జోనల్ విధానం వల్ల.. పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుతం మూడు జోన్ల పరిధిలోకి వెళ్లింది. నిజానికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ జోన్ పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ జోన్ పరిధిలో (5వ జోన్) ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉండేవి. ప్రస్తుతం అమల్లోకి వచ్చే నూతన జోన ల్ విధానంతో గత జోనల్ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇందులో మన ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాలు మూడు జోన్ల పరిధిలోకి వెళ్లాయి. వాటి వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల వేదికగా ఏర్పాటైన జోన్-3 పరిధిలోకి కరీంనగ ర్, రాజన్న సిరిసిల్ల.. కాళేశ్వరం పేరుతో ఏర్పాటైన జోన్-1 పరిధిలోకి పెద్దపల్లి.. బాసర పేరుతో ఏర్పాటైన జో న్-2 పరిధిలోకి జగిత్యాల వెళ్లాయి. నిజానికి జిల్లాల పు నర్వ్యవస్థీకరణకు ముందు కాళేశ్వరం కూడా ఉమ్మడి కరీంనగర్లోనే ఉండేది. ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోకి వెళ్లింది. అంటే నిశితంగా చూస్తే.. పూర్వ ఉమ్మడి జిల్లా కొత్తగా ఏర్పడిన మూడు జోన్ల పరిధిలోకి వెళ్లింది.
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జోనల్ వ్యవస్థతో మన ప్రాం త బిడ్డలకు మేలు చేకూరనున్నది. ముఖ్యంగా స్థానికేతరుల(నాన్ లోకల్) కోటాకు దాదాపు కత్తెర పడుతుంది. 5 శాతం అవకాశం కనిపిస్తున్నా అందులోనూ స్థానికులు పోటీ పడే అవకాశముంటుంది. నిజానికి పాత జోనల్ వ్యవస్థలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ వరకు స్థానికేతరులు భారీగా పోస్టులు తన్నుకొని పోయారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న జోనల్ విధానం ప్రకారం చూస్తే.. జిల్లా కేడర్లో 80:20, ఉండేది. అంటే వంద పోస్టులు పడితే అందులో 80 పోస్టులు స్థానికులకు, 20 పోస్టులు స్థానికేతర రిజర్వేషన్లగా పరిగణించి భర్తీ చేసేవారు.
ఇక జోనల్ కేడర్లో 70:30 శాతం, బహుళ జోన్లో 60:40 శాతం రిజర్వేషన్లుండేవి. ఇక కీలకమైన గ్రూప్-1 (ఆర్డీవో, డీఎస్పీ, ఎంపీడీవో తదితర ప్రధాన పోస్టులు) రాష్ట్ర స్థాయి కేడర్ ఉండేది. గ్రూప్-1 కేడర్ నియామకాల సందర్భంగా తెలంగాణ బిడ్డలకు తీవ్ర అన్యా యం జరిగింది. అలాగే జోన్, జిల్లా స్థాయి కేడర్లలోనూ ఇతర జిల్లాలు, జోన్ల వారికి అవకాశముండడంతో ఆ ఉద్యోగాలను సైతం నష్టపోవాల్సి వచ్చింది. కానీ, ఇక నుంచి మన ఉద్యోగాలు మనకే దక్కుతాయి. జిల్లా, జోనల్, మల్టీ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. ఆ లెక్కన గతంలో జరిగిన భర్తీ విధానంతో పోలిస్తే జిల్లా స్థాయి పోస్టుల్లో అదనంగా 15 శాతం, జోనల్ కేడర్ 25 శాతం, మల్టీ జోన్ పరిధిలో 35 శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి. జిల్లా, జోనల్, మల్టీ జోన్ పరిధిలో కేవలం ఐదు శాతం మాత్రమే స్థానికేతర రిజర్వేషన్లు ఉంటాయి.
ఇందులోనూ మన స్థానికులు పోటీ పడవచ్చు. దీని వల్ల కొత్తగా చేపట్టే నియామకాల్లో ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు భారీగా లబ్ధిపొందుతారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు మల్టీ జోన్లు ఉండగా.. అందులో 4, 5, 6 జోన్లు కలిపి ఒక మల్టీజోన్ ఉండేది. ఈ జోన్ పరిధిలోని 4వ జోన్ పరిధిలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు వచ్చేవి. దీని ద్వారా మల్టీ జోన్ పోస్టులు, రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల్లో ఎక్కువ శాతం వీల్లే ఉండేవారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ జోన్, మల్టీ జోన్లకు వాటి పరిధిలోని వారిని లోకల్ అభ్యర్థులుగా గుర్తించారు. ఆర్డీవో, డీఎస్పీ, ఎంపీడీవో లాంటి పోస్టులను సైతం మల్టీ జోన్ పోస్టులుగా మార్చివేశారు. దీంతో జిల్లా నుం చి మొదలుకొని, జోన్, మల్టీజోన్ పరిధిలో 95 శాతం లోకల్ అభ్యర్థులకే ఉద్యోగాలు రానున్నాయి. కొత్త విధానంలో తెరపైకి వచ్చిన మల్టీ జోన్-1 పరిధిలోకి కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు వస్తాయి. అంటే ఉమ్మడి జిల్లా మొత్తం మల్టీ జోన్-1 పరిధిలోనే ఉంటుంది.
వయోపరిమితితో ప్రయోజనం..
జోనల్ వ్యవస్థ ఆమోదం.. కోర్టు కేసులతో ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కాస్త ఆలస్యమైంది. ఆ కారణం గా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు అర్హత వ యసు కోల్పోయారు. మరెంతో మంది అర్హతకు బార్డర్ లైన్లో ఉన్నారు. వీరందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పు డు తీపి కబురు అందించారు. ఉద్యోగాల కోసం ఎదరుచూసి వయసు మళ్లుతున్న వారికి సైతం ఉద్యోగం వచ్చేలా గరిష్ఠ వయో పరిమితి పదేళ్లు పెంచారు. ఓసీ అభ్యర్థులకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49, దివ్యాంగ అభ్యర్థులకు 54, ఎక్స్ సర్వీస్మెన్లకు 47 ఏండ్లు పెంచనున్నారు. ఈ నిర్ణయంతో మల్టీజోన్లో ఉన్న 9,374 ఉద్యోగ ఖాళీల్లో సైతం వీరికి అవకాశం లభించనున్నది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 700 మందికి లబ్ధి చేకూరనున్నది.