కార్పొరేషన్, డిసెంబర్ 2: స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకుల సాధనే లక్ష్యంగా మున్సిపల్ శాఖ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా బల్దియాల్లో వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించింది.. చేపట్టిన కార్యక్రమాల వివరాలతో కూడిన నివేదికను ఈనెల 7వ తేదీలోగా సమర్పించాలని పాలకవర్గాలకు నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా వందశాతం ఇంటింటా, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరణ, డంప్యార్డుల శుద్ధీకరణ, శాస్త్రీయ విధానంలో బయోమెడికల్ వేస్ట్ క్లీనింగ్పై దృష్టిసారించాలని సూచించింది. పారిశుధ్య కార్యక్రమాల్లో కార్పొరేటర్లు, ఆర్పీలు, వార్డు కమిటీ సభ్యులను భాగస్వాములను చేయడం, ఎక్కువ మంది స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, హోమ్ కంపోస్టు ఎరువు తయారీ లాంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది.
అవగాహన కార్యక్రమాలు
మున్సిపాలిటీల్లో వివిధ అంశాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ పోటీలు, ఇతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ సూచించింది. విద్యాలయాల్లో విద్యార్థులకు స్వచ్ఛతపై పోటీలు నిర్వహించనున్నారు. పరిసరాల పరిశుభ్రతపై యూత్ కమిటీలు, మహిళా సంఘాలతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్వచ్ఛత విషయంలో వ్యాసరచన పోటీలు, పోస్టర్లు, క్లీన్ వార్డులు తదితర అంశాల్లో పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం కోసం కృషి చేసిన వారిని గుర్తించి ప్రోత్సాహకం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆయా విభాగాల్లో పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బెస్ట్ హోమ్ కంపోస్టు, హోటళ్లు, దవాఖానలు, విద్యా సంస్థలు, స్వశక్తి సంఘాలు, శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్, ఎన్జీవో, మహిళా సంఘాల సీవోలు, ఆర్పీలను గుర్తించి ప్రోత్సాహకాలను అందించాలని పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.