మల్లపురం: శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి జనవరి 2, 2019లో ఇద్దరు మహిళా కార్యకర్తలు వెళ్లిన విషయం తెలిసిందే. మహిళా కార్యకర్త కనకదుర్గతో పాటు లాయర్ బిందు అమ్మిని ఆ రోజున ప్రత్యేక భద్రత మధ్య ఆలయ దర్శనం చేసుకున్నారు. 10 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు శబరిమల విజిట్ చేయవచ్చు అని సుప్రీం సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ఘటన చోటుచేసుకున్నది. అయితే అయ్యప్ప ఆలయానికి వెళ్లిన మహిళా కార్యకర్త కనకదుర్గ మంగళవారం పెళ్లి చేసుకున్నది. తోటి కార్యకర్త విలయోడి శివన్కుట్టీని ఆమె పెళ్లాడింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఆ ఇద్దరూ తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఇద్దరం ఒంటరిగా జీవిస్తున్నామని, ఇద్దరమూ కార్యకర్తలేమని, ఇప్పుడు మేం ఇద్దరం కలిసి జీవించాలని భావిస్తున్నట్లు శివన్కుట్టి తెలిపాడు.
వాస్తవానికి కనకదుర్గకు ఇది రెండవ పెళ్లి. 2019లో అయ్యప్ప గుడికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆ ఏడాది జూన్లో ఆమె విడాకులు తీసుకున్నది. శబరిమల వెళ్లి వచ్చిన తర్వాత అత్త తనపై దాడి చేసినట్లు కనకదుర్గ చెప్పింది. మావో సానుకూల అయ్యంకలి పద గ్రూపులో చాన్నాళ్లుగా కామ్రేడ్గా చేస్తున్న శివన్కుట్టితో ఏడాది కింద కనకదుర్గకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం పెళ్లికి దారితీసింది.