రెంజల్, జనవరి 18: జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా రూ. ఆరు వందల కోట్లతో చేపట్టిన ఎన్హెచ్ నంబర్ 161 బీబీ పనులకు సంబంధించిన సర్వే నిజామాబాద్ జిల్లాలో పూర్తయ్యింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ నుంచి నిర్మల్ జిల్లా భైంసా వరకు ఎన్హెచ్61 జాతీయ రహదారికి అనుబంధంగా నిర్మిస్తున్నారు. మద్నూర్ నుంచి భైంసా వరకు ఈ ఫోర్లేన్ రహదారిని నిర్మించనున్నారు. భారత్మాల పరియోజన కింద మంజూరైన ఈ రహదారిని మద్నూర్, సొనాల, తడిహిప్పర్గ, లింబూర్, సిర్పూర్, కోటగిరి, రుద్రూర్, బోధన్, బాసర మీదుగా భైంసా వరకు నిర్మించనున్నారు.
మహారాష్ట్ర లోని భీవండి నుంచి నిర్మల్ వరకు నిర్మిస్తున్న 61వ నంబర్ జాతీయ రహదారికి భైంసా వద్ద ఎన్హెచ్-161బీబీ కలువనున్నది. తొలిదశలో భైంసా-బోధన్ మధ్య 56కిలోమీటర్ల పొడవునా రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం గత ఏడాది రూ.600 కోట్ల నిధులు మంజూరవగా.. ప్రస్తుతం సర్వే పనులు పూర్తయ్యాయి. భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) గతనెలలో ప్రారంభించి, మంగళవారంతో సర్వే పనులను పూర్తిచేసింది. బోధన్ మండలం ఆచన్పల్లి, రెంజల్ మండలం సాటాపూర్, బోర్గాం, తాడ్బిలోలి, బైపాస్ గుండా రహదారి నిర్మాణం కోసం సర్వే పూర్తి చేసి హద్దులను గుర్తించారు. నవీపేట మండలం ఫకీరాబాద్ రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రహదారిపై ప్రతి గ్రామం వద్ద ఓ జంక్షన్ను ఏర్పాటు చేయనున్నారు.
కేంద్రంపై ఎంపీ బీబీ పాటిల్ ఒత్తిడి
కేంద్ర ప్రభుత్వంపై జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఒత్తిడి తెచ్చి భారత్మాల పరియోజన కింద ఈ రహదారిని మంజూరు చేయించారు.
టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తాం
బోధన్ – బైంసా వరకు మంజూరైన జాతీయ రహదారికి టెండర్లు పూర్తికాగానే పనులను పూర్తి చేస్తాం. బైపాస్ వెళ్లేందుకు నెలరోజుల క్రితం ప్రారంభించిన రహదారి సర్వే మంగళవారం పూర్తయ్యింది.
-సతీశ్, ఏఈఈ