హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కల్వకుర్తి-హైదరాబాద్ ఫోర్లేన్ జాతీయ రహదారి విస్తరణ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ సైతం రాశారని తెలిపారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సోమశిల మీదుగా కల్వకుర్తి-నాగర్కర్నూలు వయా నంద్యాల వరకు జాతీయ రహదారి మంజూరైందని చెప్పారు. ఇందుకోసం జాతీయ రహదారుల చట్టం ప్రకారం భూసేకరణ కోసం నాగర్కర్నూలు కలెక్టర్ను గతనెల 7న నియమించామని చెప్పారు. రాష్ట్రంలో రహదారుల విస్తరణ ఎంతో పురోగమిస్తున్నదని వెల్లడించారు.