శ్రీశైలం : దేవీ శరన్నవరాత్రోత్సవాలు శ్రీశైలంలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భ్రమరాంబ అమ్మవారు కుష్మాండ దుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవి అవతారాల్లో కుష్మాండ దుర్గ సాత్విక రూపంలో సింహవాహనాన్ని అధిష్టించి ఎనిమిదిచేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద,జపమాల, అమృతకళశాన్ని దాల్చి భక్తులను అనుగ్రహించింది. ఈ దేవిని పూజించడంవల్ల సర్వ రోగాలు తొలగిపొయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని ఆలయ ఈవో లవన్న తెలిపారు.
రాత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు కైలాసవాహనంపై భక్తులను కటాక్షించారు. దేవాలయ ప్రాంగణంలోని అక్కమహదేవి అలంకారమండపంలో అర్చక వేదపండితులు, కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాకారోత్సవంలో కైలాస వాహనంపై అమ్మవారితో కలిసి ముక్కంటి భక్తులకు దర్శనం ఇచ్చారు.
అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. ప్రాకారోత్సవంలో ఈవో లవన్న, ఈఈ బాలమురళీ కృష్ఱ, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు హరిదాస్, మల్లయ్య, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్ పర్యవేక్షకులు శ్రీహరి, సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, అయ్యన్న, రవి పాల్గొన్నారు.
రేపు స్కందమాతా అలంకారంలో..
శరన్నవరాత్రుల్లో ఐదోరోజు సోమవారం భ్రమరాంబాదేవి అమ్మవారు స్కందమాతా అలంకారంలో దర్శనమివ్వగా మల్లికార్జున స్వామివారికి శేష వాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈవో కేఎస్ లవన్న తెలిపారు.