మహబూబ్నగర్ టౌన్: రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీలో మహబూబ్నగర్ జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో బుధవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మహబూబ్నగర్ 54-51 తేడాతో రంగారెడ్డిపై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఫైనల్లో ఇరు జట్ల ప్లేయర్లు ప్రతిభ చాటారు. విజేతగా నిలిచిన మహబూబ్నగర్ జట్టుకు రూ.75 వేలు, రన్నరప్ రంగారెడ్డికి రూ.50వేలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన వరంగల్, నల్లగొండ జట్లకు చెరో రూ.25 వేల చొప్పున నగదు బహుమతి అందించారు. అంతకుముందు క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీశ్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత విజేతలకు బహుమతులు అందజేశారు.