ముషీరాబాద్, డిసెంబర్ 15: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో బుధవారం జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయ న పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్, కోటా ప్రమోషన్లతో నిరుద్యోగులకు అన్యాయం జరుగకుండా చూడాలన్నారు. అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నదని విమర్శించారు. నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా పోరాడి ఉద్యోగాలు సాధించుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘాల నేతలు ఎర్ర సత్యనారాయణ, సుధాకర్ ముదిరాజ్, చంటి ముదిరాజ్, పగిళ్ల సతీశ్, గుజ్జ కృష్ణయాదవ్, రాఘవేంద్రరావు, భాస్కర్, ప్రజాపతి, ప్రభాకర్రెడ్డి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.