హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ యువ హాకీ ప్లేయర్ ఈదుల జ్యోతిరెడ్డి ప్రతిభకు గుర్తింపు లభించింది. హాకీలో నిలకడగా రాణిస్తున్న జ్యోతి.. జాతీయ ఉత్తమ అథ్లెట్ అవార్డు అందుకుంది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకుంది. దీంతో పాటు రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకం దక్కించుకుంది. ప్రస్తుతం భోపాల్ సాయ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న జ్యోతి భారత జూనియర్ హాకీ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్గా కొనసాగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన ప్లేయర్లను సాయ్ అవార్డులతో సత్కరించి కొత్త సంప్రదాయానికి తెరతీసింది.