హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): దేశ సేవకు యువత చొరవ చూపాలని, యుద్ధరంగంలో పాల్గొనేందుకు ముందుకు రావాలని జస్టిస్ బీ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. ఆర్మీ డే సందర్భంగా ఆదివారం ఆయన హస్తినాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో నాయక్ సుబేదార్ జగన్నాథరావును ఘనంగా సన్మానించారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. భారత సైనికుల త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. మూడు యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొని పదవీ విరమణ చేసిన జగన్నాథరావు సేవలను శ్లాఘించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాట జ్ఞాపకాలను జగన్నాథరావు గుర్తు చేసుకొన్నారు. ఆ తర్వాత పంజాబ్ లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’తోపాటు శ్రీలంక శాంతి దళాల్లో పని చేశానని వివరించారు. కార్యక్రమంలో ఆకృతి అధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.