శామీర్పేట, మార్చి 27: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం (జస్టిస్ బీపీ జీవన్రెడ్డి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ లాస్- జేఆర్సీఐటీబీఎల్) ఏర్పాటుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్రెడ్డి రూ.1.50 కోట్ల విరాళమిచ్చారు. ఆదివారం ఆయన ఈ చెక్కును రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ సతీశ్చంద్రశర్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార చట్టాలపై సమకాలీన పరిశోధనలు, బోధన లక్ష్యాల సాధనకు ఈ సెంటర్ ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. జస్టిస్ బీపీ జీవన్రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి, జస్టిస్ పీవీ రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి, పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ రాజశేఖర్రెడ్డి, పీ నవీన్రావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి, జెనీవా (స్విట్జర్లాండ్)లోని ఇన్స్టిట్యూట్ డీ డ్రాయిట్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పీఎస్ రావు, నల్సార్ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ప్రముఖ న్యాయవాది మయూర్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.