‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు వ్యాఖ్యాతగా ఎన్టీఆర్
విజయం వల్ల కేవలం డబ్బును మాత్రమే కాకుండా అంతకుమించిన ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకోగలుగుతామని చెప్పారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్. ఏరంగంలోనైనా విజయం మరింత ఉత్సాహంగా పనిచేయడానికి, కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకోవడానికి ప్రేరణనిస్తుందని తెలిపారు. ‘బిగ్బాస్’షో ద్వారా బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ఆయన తాజాగా జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రోగ్రామ్ ప్రోమోను శనివారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ “ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి ప్రయోక్తగా ఒప్పుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. ఈ షో ద్వారా భిన్న జీవన స్రవంతుల నుంచి వచ్చిన వ్యక్తులతో సంభాషించే అరుదైన అవకాశం దక్కుతుందని భావించా. వారి జీవన విధానం, ప్రయాణం గురించి తెలుసుకుంటూ మొత్తంగా మనిషియొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందనుకుంటున్నా. నాగార్జున, చిరంజీవిగార్లు ఈ షోపై వారిదైన ప్రత్యేక ముద్రవేశారు కాబట్టి దీనినొక ఛాలెంజ్గా భావిస్తున్నా. సగౌరవంగా ఈ బాధ్యతను స్వీకరించి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ ప్రాజెక్ట్ అవసరం దృష్ట్యా గత మూడేళ్ల నుంచి బయట ఎక్కువగా కనిపించడం లేదు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్లో భాగమైనందుకు గర్విస్తున్నా. నా ఇద్దరు పిల్లలతో విరామ సమయాన్ని సంతోషంగా గడుపుతున్నా. అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదనుకుంటున్నా. ఇక రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన ప్రశ్నకు ఇది సమయం సందర్భం కాదనుకుంటున్నా’ అన్నారు.