అలంపూర్:దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలంపూరు క్షేత్రంలో గణపతి పూజ, చండీ హోమాలు, వారోత్సవ పూజలు, దర్బార్ సేవ, నీరజ మంత్ర పుష్పాలు, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు జోగుళాంబాదేవి బ్రహ్మచారిణి మాతగా భక్తులకు దర్శమినచ్చింది.
ఒక చేతిలో కమండలం, మరో చేతిలో పుస్తకం, జపమాల, దండం, ధరించి సాధువుగా ఉంటూ దర్శనమిచ్చే ఈ మాత ను ఆరాధించడం వల్ల మానవులు అరిషట్ వర్గాలను జయించవచ్చని అర్చకులు వివరించారు. జీవితంలో వచ్చే ఒడి దుడుకులను ధైర్యంగా ఎదుర్కునే శక్తిని మాత ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.
శుక్రవారం ప్రత్యేక రోజును పురష్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ వైస్ చైర్మన్ వెంకటాచలం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ సదానందమూర్తి ఉన్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో వీరేశం, ఆలయ ధర్మకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలాఉండగా హైదరాబాద్కు చెందిన శ్రీధర్ నాయుడు- శ్రీలక్ష్మి దంపతులు అలంపూరు ఆలయంలో నిత్యాన్నదాన సత్రంకు లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ రవి ప్రకాశ్గౌడ్కు అందజేశారు. కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు హరి ప్రియ, హరి చందన్ తదితరులు పాల్గొన్నారు.