ఆదిలాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అర్ఫా గార్డెన్, తనీషా గార్డెన్, శాంతినగర్ కమిటీ హాలులోనూ మహిళలకు జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఎమ్మెల్యే చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయంలో సేవలందించిన మున్సిపల్ కార్మికులను శాలువాతో సత్కరించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణలోని అతిపెద్ద పండుగల్లో ఒకటైన బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందిన టీఆర్ఎస్ సర్కారేనన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పండుగ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కట్టుకోవాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళలు బతుకమ్మ సంబురాలను ప్రభుత్వ లాంఛనాలతో గల్లీ గల్లీలో ఆనందంగా జరుపుకుంటున్నారన్నారు. పలువురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇకనైనా విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆత్మ డివిజన్ చైర్మన్ రమేశ్, డీఆర్డీఏ పీడీ కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు, బండారి సతీశ్, నర్సింగ్, అశోక్ స్వామి, లక్ష్మణ్ పట్టణాధ్యక్షుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.