హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, సీపీయస్ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు ఇచ్చింది. హైదరాబాద్లో రెండురోజులపాటు జరిగిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(ఏ ఐ ఎస్ జీ ఈ ఎఫ్) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులు, 29 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం తరపున అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వగా ఏఐఎస్జీ ఈఎఫ్ జాతీయ చైర్మన్ సుభాష్ లాంబ, ప్రధానకార్యదర్శి శ్రీ కుమార్ ల అధ్యక్షతన సమావేశం జరిగింది.
రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో కేంద్రప్రభుత్వ తీరుపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణను ఆపాలని, ధరలను నియంత్రించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని, దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. కొవిడ్తో మరణించిన ఉద్యోగ కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసం పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరిపే సందర్భంలో సమ్మె నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. రంగారెడ్డి అధ్యక్షుడు కే లక్ష్మణ్, ముజీబ్, విక్రమ్, శ్రీరామ్, శ్రీకాంత్ లతోపాటు కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కొల రాజేశ్ కుమార్ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు లతో పాటు కేంద్ర కార్య వర్గ సభ్యులు, (33) జిల్లాల అధ్యక్ష , కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.