న్యూఢిల్లీ, మార్చి 28: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు జోరందుకుంటున్నాయి. గతేడాది లక్షలాది మంది టెక్నాలజీ నిపుణులను నియమించుకున్న దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఇదే ట్రెండ్ను ప్రస్తుత ఏడాది కూడా కొనసాగించబోతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ దిగ్గజాలు లక్షన్నర మంది కొత్త ఉద్యోగాలను తీసుకోగా..వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంతకుమించి తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ను నిజం చేస్తూ ప్రముఖ ఉద్యోగ కల్పన సంస్థ టీమ్లీజ్ సర్వీసెస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఈ సంవత్సరం ఐటీతోపాటు పలు రంగాల్లో నియామకాలు, వేతనాల పెంపు చాలా బాగుంటుందని, వచ్చే కొద్ది త్రైమాసికాల్లో రిక్రూట్మెంట్స్ జోరు కొనసాగనున్నదని పేర్కొంది. ఐటీ నిపుణలుకే కాకుండా సాధారణ ఉద్యోగాలకు సైతం డిమాండ్ జోరుగా ఉన్నదని తెలిపింది. పరిశ్రమ ట్రెండ్స్పై టీమ్లీజ్ సీఎఫ్వో రమణి దాతి ఒక ఆంగ్లచానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలు వెల్లడించారు. వివరాలివి..
బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ)తోపాటు రిటైల్, వినియోగ ఆధారిత కంపెనీల్లో కొత్త ఉద్యోగాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఐటీలో పటిష్ఠమైన డిమాండ్ మరో రెండేండ్ల వరకు కొనసాగుతుందని అంచనా. తయారీ, ఆటోమొబైల్ రంగాల్లో కూడా సాధారణ సిబ్బంది కోసం నియామకాలు పెరుగుతున్నాయి. వచ్చే త్రైమాసికాల్లో ఈ రంగాల్లో జాబ్స్కు డిమాండ్ బాగుంటుందని అంచనా వేస్తున్నాం. మరోవైపు, బీఎఫ్ఎస్ఐ, వినియోగ రంగాలు కొవిడ్ సంక్షోభం నుంచి శరవేగంగా కోలుకున్నాయి. ఈ-కామర్స్పై ఏ మాత్రం ప్రభావం పడలేదు. అంతేకాకుండా ఈ రంగంలో డిమాండ్ జోరుగా పెరుగుతున్న ట్రెండ్ కనపడుతున్నది. రిటైల్, విమానయానం, టూరిజం రంగాలు మాత్రం కొవిడ్ ముందస్తు స్థాయికి కోలుకోలేదు. అయితే రిటైల్ రంగంలో జాబ్స్ని ఈ-కామర్స్ వేగంగా భర్తీ చేస్తున్నది. ఇప్పుడు తయారీ, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ తదితర రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ అధికమవుతున్నది.
కొద్ది సంవత్సరాలుగా మనం వార్షిక ద్రవ్యోల్బణంతో సమానంగా వేతనాల పెంపును చూడటానికి అలవాటు పడిపోయాం. అంటే…4-6 శాతం. గత ఏడాది మాత్రం వేతనాల పెంపు అధికంగా జరిగింది. సాధారణ సంస్థల్లో 10 శాతం, ఐటీలో 12-13 శాతం మేర జీతాలు పెరిగాయి. ఈ సంవత్సరం కూడా పెంపు అదేస్థాయిలో ఉంటుందని అంచనా. మేము సర్వీసులు అందించే కంపెనీల్లో సాధారణ సిబ్బందికి నెలసరి సగటు వేతనం రూ. 23,000 ఉండగా… ఐటీ, ఇతర స్పెషలైజ్డ్ వ్యాపారాల్లో ఇది రూ.55,000 ఉంది. స్పెషలైజ్డ్ స్టాఫింగ్ బిజినెస్కు సంబంధించి మూడు కస్టర్లు..ఐటీ సర్వీసులు, ప్రొడక్ట్లు, క్యాప్టివ్స్లో మా కస్టమర్లు (కంపెనీలు) ఉన్నారు. జావా, ఇతర రెగ్యులర్ టెక్ స్కిల్ సెట్స్లో మిడ్ లెవల్ ఉద్యోగుల్ని మేము రిఫర్ చేస్తున్నాం. ఇక ప్రొడక్ట్, క్యాప్టివ్స్ వ్యాపారాల్లో ఉన్న ఐటీ కంపెనీలకు ప్రత్యేక నిపుణులు, హయ్యర్ స్కిల్ సెట్స్ కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల్లో నెలకు రూ. 1 లక్ష వరకూ వేతనాలున్నాయి. ప్రొడక్ట్, క్యాప్టివ్ కంపెనీల్లో రిక్రూట్మెంట్స్ పెరుగుదలను గమనిస్తున్నాం. అప్పర్ లెవల్ ఐటీ ట్యాలెంట్కు గట్టి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం.