న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వాట్సాప్ చేస్తే చాలు.. కిరాణా, కూరగాయలు, ఇతర నిత్యవసరాల్ని సరఫరా చేసేందుకు జియోమార్ట్ సిద్ధం. బిలియనీర్ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ జియోమార్ట్ ఈ సదుపాయాన్ని ప్రారంభించనుంది. వాట్సాప్ ద్వారా సరుకుల్ని ఆర్డర్ చేసే విధానాన్ని బుధవారం మెటా (గతంలో ఫేస్బుక్) నిర్వహించిన కార్యక్రమంలో ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీలు ప్రదర్శించారు. ‘ట్యాప్ అండ్ ఛాట్’ ఆప్షన్ నుంచి వాట్సాప్ ద్వారా వినియోగదారులు ఆర్డర్ చేయవచ్చు. డెలివరీ ఉచితం కాగా, ఆర్డర్ కనీస విలువపై పరిమితి లేదు. కస్టమర్లు యాప్లో వారి ఆర్డర్ను ఇచ్చి వయా జియోమార్ట్కు లేదా డెలివరీ తర్వాత నగదును చెల్లింపులు చేయవచ్చు.
వాట్సాప్తో జియో రీచార్జ్
త్వరలో జియో యూజర్లు వాట్సాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు రిలయన్స్ జియో, మెటాలు ప్రకటించాయి. 2022లో ప్రవేశపెట్టే ఈ ఫీచర్తో రీచార్జ్ ప్రక్రియ సరళంగా ఉంటుందని, ముఖ్యంగా వృద్ధులకు ఉపయోగకరమని జియో ప్లాట్ఫామ్స్ డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీలు చెప్పారు.
రూపాయికే జియో రీచార్జ్
రిలయన్స్ జియో ఒక వినూత్న ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్క రూపాయితో రీచార్జ్ చేసుకుని 30 రోజుల వ్యాలిడిటీతో 100 ఎంబీ డాటాను పొందవచ్చు. డాటా పరిమితి ముగిస్తే స్పీడ్ 64 కేబీపీఎస్కు తగ్గుతుందని జియో తెలిపింది. మైజియో యాప్లోనే ఈ సదుపాయం లభిస్తుంది. ఆ యాప్లో ‘అదర్స్’లో వాల్యూ అనే సెక్షన్ను ఓపెన్ చేస్తే రూపాయి ప్యాక్ కన్పిస్తుంది. యూజర్లు 500 ఎంబీ డాటా కావాలంటే ఐదుసార్లు, 1 జీబీ డాటా కావాలంటే పదిసార్లు రీచార్జ్ చేసుకోవాలి. గరిష్ఠంగా ఎన్నిసార్లు రీచార్జ్ చేసుకోవొచ్చన్న అంశంపై స్పష్టత లేదు.