న్యూఢిల్లీ, జనవరి 19: దేశీయ టెలికం రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న జియో..ఫిక్స్డ్-లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు అందించడంలోనూ అగ్రస్థానానికి చేరుకున్నది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆధిపత్యానికి చెక్ పెట్టింది జియో. గత 20 ఏండ్లుగా బీఎస్ఎన్ఎల్ తొలి స్థానంలో ఉండగా..ఈ స్థానాన్ని జియో చేజిక్కించుకున్నది. ఈ విషయాన్ని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. 2021 నవంబర్ నెలకుగాను విడుదలైన డాటా ప్రకారం జియోకు 43.4 లక్షల ఫిక్స్డ్లైన్ బ్రాడ్బ్యాండ్ ఖాతాదారులు కలిగివున్నారు. అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 41.6 లక్షలని పేర్కొంది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య 47.2 లక్షల నుంచి 42 లక్షలకు తగ్గింది. 40.8 లక్షల మంది ఖాతాదారులతో భారతి ఎయిర్టెల్ ఈ విభాగంలో తృతీయస్థానంలో ఉంది. 2019 సెప్టెంబర్ నెలలో బీఎస్ఎన్ఎల్కు 86.9 లక్షల ఫిక్స్డ్లైన్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు సగానికి తగ్గింది. అదే సమయంలో జియో బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్ని ప్రారంభించగా, ఈ కాలంలో ఎయిర్టెల్ ఖాతాదారుల సంఖ్య 24.1 లక్షల నుంచి 40.8 లక్షలకు చేరింది.
స్పెక్ట్రం చెల్లింపులు రూ. 30,791 కోట్లు..
తమ స్పెక్ట్రం బకాయిలన్నింటినీ వడ్డీతో సహా చెల్లించినట్లు రిలయన్స్ జియో బుధవారం తెలిపింది. 2021 మార్చికి ముందు వేలంలో పొందిన స్పెక్ట్రంకు మొత్తం రూ.30,791 కోట్లు టెలికం శాఖకు చెల్లించామని కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది.ఈ బకాయిలను చెల్లించటంతో సంవత్సరానికి రూ. 1200 కోట్ల వడ్డీ మిగులుతుందని రిలయన్స్ జియో వివరించింది. వాస్తవానికి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 2034-35 వరకు కంపెనీ స్పెక్ట్రం వాయిదాలను చెల్లించాల్సి ఉంది.