రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోదరుడు ఎమ్మెల్యే బసంత్ సోరెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుమ్కా నియోజకవర్గానికి చెందిన బసంత్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అయితే ఒకవైపు దుమ్కాలో ఇద్దరు అమ్మాయిల రేప్, మర్డర్ ఘటనలతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఓ విలేఖరి ప్రశ్న అడిగారు. ఆ సమయంలో ఎమ్మెల్యే బసంత్ సోరెన్ సమాధానం ఇస్తూ.. అండర్ గార్మెంట్స్ కొనేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు చెప్పారు. వాటిని తాను అక్కడే కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉన్నా.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. అండర్ గార్మెంట్స్ కొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లు చెప్పిన సోరెన్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. పేదలు, గిరిజన ప్రజల నేత శిబూ సోరెన్ కుమారుడు లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ట్వీట్ చేశారు. అందుకే దుమ్కా ఎమ్మెల్యే బాధితుల్ని కలుసుకోవడం లేదని ఆరోపించారు.