ఒక జీవన్మృతుడి అవయవదానం.. అంధుడికి చూపునిస్తుంది. హృద్రోగికి గుండె స్పందన ప్రసాదిస్తుంది. కాలేయ వ్యాధిగ్రస్థుడికి సంజీవని అవుతుంది. మూత్రపిండ రోగికి అండగా నిలుస్తుంది. కొన్ని కుటుంబాలు వీధిన పడకుండా కాపాడుతుంది. తెలంగాణలో ఆ మహాదాన మహోద్యమ సారథి, ‘జీవన్దాన్’ ఇన్చార్జి.. ప్రొఫెసర్ జి.స్వర్ణలత. ఆమె నేతృత్వంలో ఆ ప్రాజెక్ట్ దేశానికే పాఠాలు నేర్పుతున్నది. ఎందుకంటే, గత ఏడాది దేశవ్యాప్తంగా ఇరవైనాలుగు శాతం అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మన దగ్గరే జరిగాయి. ‘ఈ మార్పు ఏ ఒక్కరితోనో సాధ్యం కాలేదు, సమష్టి కృషి ఫలితం’ అంటున్నారు స్వర్ణలత..
జీవన్దాన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి నా వయసు ముప్పై. నెఫ్రాలజీ డిపార్ట్ మెంట్లో పదేండ్ల నుంచీ పనిచేస్తున్నా. నిమ్స్లో నా కంటే సీనియర్లు చాలామందే ఉన్నా.. నన్నే ఎందుకు ఎంపిక చేశారో అర్థం కాలేదు. కానీ ఆనందంగా అనిపించింది. నేను చిన్నప్పటి నుంచీ చాలా చురుకు. నాన్న మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్లో పనిచేసేవారు. మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు. ఆయనకు రెండేండ్లకు ఒకసారి బదిలీ అయ్యేది. అలా తరచూ స్కూల్ మారేదాన్ని. ఎక్కడున్నా తెల్లవారుజామునే నిద్రలేచేవాళ్లం. కంటోన్మెంట్ ఏరియాలో వాకింగ్ వెళ్లేవాళ్లం.
ట్రైనీ సైనికులతో కలిసి వ్యాయామం చేసేవాళ్లం. అందులోనూ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతోపాటు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి. నాకు గణితం అంటే ఇష్టం. కానీ, ఇంట్లో ఒకరు డాక్టర్ కావాలని నాన్న కోరిక. ఆయన మాట కాదనలేక.. నా ఇష్టాన్ని వదులుకోలేక మధ్యేమార్గంగా ఎంబైపీసీ తీసుకున్నాను. తిరుపతి కేంద్రీయ విద్యాలయలో ఆడుతూ పాడుతూ చదివాను. అయినా, ఎంసెట్లో 213వ ర్యాంక్ సాధించాను. మెడిసిన్ తర్వాత నిమ్స్లో ఉద్యోగం వచ్చింది. శ్రీనగర్ నుంచి వైజాగ్ వరకు సాగిన నా ప్రయాణం చివరికి హైదరాబాద్లో స్థిరపడింది.
రిస్క్ మేనేజ్మెంట్
అవయవదానం సాధారణ చికిత్సలకు భిన్నమైంది. రిస్క్తో కూడిన వ్యవహారం. చిన్నా చితకా సర్జరీల్లా నిమిషాల్లో ముగిసిపోదు. గంటలపాటు నిర్విరామంగా పని చేయాలి. బ్రెయిన్ డెత్ కేసులు అర్ధరాత్రే ఎక్కువగా వస్తుంటాయి. ఆ సమయంలో ఉన్నచోటి నుంచే పని నడిపించాలి. అవయవదాన ప్రతిజ్ఞ చేసిన వాళ్లు బ్రెయిన్ డెత్ వల్ల చనిపోతే.. వారి అవయవాలను అవసరమైన వారికి మార్చడం మాత్రమే అవయవదానమని చాలామంది అనుకుంటారు. ఇది నిజమే. కాకపోతే, ఇందులో ఎంతోమంది భాగస్వామ్యం ఉంటుంది. పోలీసు కేసులు, ఫోరెన్సిక్ వ్యవహారాలు పర్యవేక్షించడం, బంధువులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, అవయవాలు అవసరమైన రోగులను గుర్తించడం, వాళ్లను రప్పించడం, ఎవరికి సరిపోతుందో నిర్ధారించడం.. అన్నీ కొద్ది గంటల్లోనే జరిగిపోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది యుద్ధం లాంటిదే. అందుకేనేమో, మిలటరీ క్రమశిక్షణ మధ్య పెరిగిన నాకు బాధ్యతలు అప్పగించారు.
ప్రతిక్షణం అమూల్యమే
అవయవదానం కోసం హాస్పిటల్స్ను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదైనా దవాఖానలో బ్రెయిన్డెత్ జరిగినప్పుడు ఆ సమాచారం మాకు అందిస్తే.. వెంటనే డాక్టర్లు, హాస్పిటల్ నిర్వాహకులు, పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, పేషెంట్ బంధువులతో సంప్రదింపులు మొదలుపెడతాం. అవయవదానం కోసం పేర్లు నమోదు చేసుకున్న వాళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా పేషెంట్లకు సమాచారం పంపిస్తాం. బ్రెయిన్ డెత్ను నిపుణులు మాత్రమే నిర్ధారించాలి. ఈ పనులన్నీ మేం స్వయంగా పర్యవేక్షిస్తాం. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తాం. అవగాహనారాహిత్యం, అపోహలు.. కారణం ఏమైనా కావచ్చు. చాలామంది ఓ పట్టాన ఆమోదించరు. మేం ఓపిగ్గా ఒప్పిస్తాం. ఆ నిర్ణయం వల్ల ఎంత ఉపకారం జరుగుతుందో వివరిస్తాం. కుటుంబ సభ్యుల ఆమోదంతో సగం పని పూర్తయినట్టే. ఇప్పుడు, కీలక భాగాలను అవయవ మార్పిడి చేసే దవాఖానకు తరలించాల్సి ఉంటుంది. గంటల వ్యవధిలో ఆపరేషన్ పూర్తిచేయాలి. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ను నియంత్రించి సకాలంలో, సజావుగా అవయవాలను తరలిస్తాం. అదే సమయంలో పేషెంట్లను సిద్ధం చేస్తాం. ఎవరికీ అన్యాయం జరగకుండా.. వెయిటింగ్ లిస్టులో ఉన్న మొదటి ముగ్గురినీ పిలిపిస్తాం. ఆ అవయవం ఎవరికి సరిపోతుందన్నది డాక్టర్లు నిర్ధారిస్తారు. చనిపోయిన వ్యక్తి రక్తం, అవయవ స్వీకర్త రక్తం కలుస్తాయోలేదో పరీక్షిస్తారు. ఇద్దరి వయసులూ కొంత దగ్గరగా ఉంటే మరీ మంచిది. అవయవాల పరిమాణం కూడా సమంగానే ఉండాలి. అన్నీ తనిఖీ చేసుకున్న తర్వాత, ఆరు గంటల్లో ఆపరేషన్ పూర్తి చేయాలి. అందుకే నేను దీన్ని ఉద్యోగమని అనుకోను. ఉద్యమంలా భావిస్తాను.
తెలంగాణ బెస్ట్
అవయవదాన ఉద్యమంలో తెలంగాణ మొదటి నుంచీ రోల్ మోడల్గా నిలుస్తున్నది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు ఓ పోర్టల్ నిర్వహిస్తున్నాం. పక్షపాతం లేకుండాసేవలు అందించేందుకు తెలంగాణ వైద్య-ఆరోగ్యశాఖ ఓ సాఫ్ట్వేర్ రూపొందించింది. ఈ సాంకేతికత బ్లడ్ గ్రూప్, అవయవ పరిమాణం, వయసు.. మొదలైనవి లెక్కగట్టి స్వీకర్తను ఎంపిక చేస్తుంది.
అంతర్జాతీయంగా చూస్తే.. అవయవ దానంలో అమెరికా, యూరప్ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం.. జీవన్మృతదేహంపై ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. అవయవదానానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదు. యూరప్ దేశాల్లో కూడా ఇదే విధానం ఉంది. కాకపోతే, ఆ వ్యక్తి బతికున్నప్పుడు ‘నా అవయవాలు ఎవరికీ ఇవ్వవద్దు’ అని ప్రమాణపత్రం సమర్పించి ఉంటే మాత్రం మినహాయింపు ఇస్తారు. మన దేశంలో దీనికి విరుద్ధంగా.. బతికి ఉన్నపుడు అవయవదానం చేస్తామని ప్రమాణ పత్రం ఇచ్చిన వాళ్ల అవయవాలను మాత్రమే స్వీకరించాలి. అది కూడా కుటుంబం ఒప్పుకొంటేనే. ఇన్ని అడ్డంకులు దాటడం కత్తి మీద సామే. మన దగ్గర రెండు లక్షల మంది అవయవదాన ప్రమాణ పత్రాలు ఇచ్చారు. అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న రోగులు మూడువేల మంది వరకూ ఉన్నారు. అవయవ మార్పిడిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటం గర్వకారణం.
– నాగవర్ధన్ రాయల