జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : వృత్తిదారుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్న తెలంగాణ సర్కారు గొల్ల, కురుమలకు జీవాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మొదటి విడుత పంపిణీ పూర్తి కాగా, రెండో విడుతకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లోని గుం టూరు, కర్నూలు జిల్లాల నుంచి జీవాలు కొనుగోలు చేసి పంపిణీ చేసింది. ఈ సారి ప్రభుత్వం నెల్లూరు, నంద్యాల రకాలకు చెందిన గొర్రెలను కొనుగోలు చేయటానికి అనుమతినిచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 155 గొర్రెల పెంపకందారుల సొసైటీలుండగా 12,785 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడుత ప్రభుత్వం 6,351 యూనిట్లు అందజేసింది. మొదట్లో యూనిట్ కింద పొట్టేలుతోపాటు 20 గొర్రెల కోసం లబ్ధిదారుడి వాటాగా రూ.31,250 డీడీ రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం రూ.1.25 లక్షల విలువైన జీవాలను మంజూరు చేసింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రెండో విడుత యూనిట్ కాస్ట్ను రూ.1.75 లక్షలకు పెంచింది. లబ్ధిదారులు ఇకపై రూ.43,750 డీడీ తీయాల్సి ఉంటుంది. అంతకు ముందు డీడీలు చెల్లించి జీవాలు తీసుకోకుండామిగిలిన 534పైగా లబ్ధిదారులు సహా ఇక ముందు డీడీలు చెల్లించే వారికి పెరిగిన యూనిట్ ధరలు వర్తించనున్నాయి. వారిలో 417 మందికి యూనిట్ల పంపిణీ ప్ర క్రియ పూర్తి కాగా, 117 యూనిట్లకు గ్రౌండింగ్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నారు. తాజాగా జీవాల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అధికారులు, లబ్ధిదారులు జీవాలను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, నంద్యాలకు వెళ్లారు.
నెల్లూరు, నంద్యాల నుంచి గొర్రెల కొనుగోళ్లు
నెల్లూరు, నంద్యాల రకాలకు చెందిన గొర్రెలను కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో లబ్ధిదారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి జీవాలను కొనుగోలు చేస్తున్నారు. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.
నిత్యం పర్యవేక్షణ…
ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గొర్రెల యూనిట్లకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. గొర్రెలకు వ్యాక్సినేషన్ రెగ్యులర్గా అందించనున్నారు. వ్యాధుల ప్రభావంతో లబ్ధిదారులు సమస్యలు ఎదుర్కోకుండ తగిన చర్యలను జిల్లా అధికారులు చేపడుతున్నారు.
మండలాల వారీగా మంజూరైన యూనిట్లు
భూపాలపల్లి మండలంలో 165, గణపురం 48, రేగొండ 91, చిట్యాల 77, మొగుళ్లపల్లి 48, టేకుమట్ల 13, మహాముత్తారం 38, కాటారం 13, మహదేవపూర్ 36, పలిమెల 5 చొప్పున మొత్తం 534 యూనిట్లను మంజూరయ్యాయి. మల్హర్రావు మండలంలో సొసైటీ ఉన్నప్పటికీ ఎలాంటి దరఖాస్తు రాలేదని అధికారులు చెబుతున్నారు.