టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో బుమ్రా.. ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా ‘SENA’ దేశాలపై వంద వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్ గా నిలిచాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలున్నారు.
క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలను ‘SENA’ దేశాలుగా వ్యవహరిస్తారు. ఈ నాలుగు దేశాలపై వారి దేశాలలో టెస్టులు ఆడుతూ వంద వికెట్లు తీశాడు బుమ్రా. తద్వారా ఈ దేశాలపై గతంలో వంద లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్ గా ప్రసిద్ధికెక్కాడు.
బుమ్రా.. సౌతాఫ్రికా పై 26 వికెట్లు, ఇంగ్లండ్ పై 37, న్యూజిలాండ్ పై 6, ఆస్ట్రేలియా పై 32 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ నాలుగు దేశాలపై బుమ్రా 101 వికెట్లు తీశాడు.
దీంతో ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (141 వికెట్లు), ఇషాంత్ శర్మ (130), జహీర్ ఖాన్ (119), మహ్మద్ షమీ (119), కపిల్ దేవ్ (117) ల సరసన నిలిచాడు. ఇప్పటివరకు బుమ్రా తన కెరీర్ లో 29 టెస్టులాడి 123 వికెట్లు పడగొట్టగా.. అందులో ‘SENA’ దేశాలలోనే 101 వికెట్లు తీయడం గమనార్హం.