అమరావతి : జగన్ సర్కారుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ ఏం మాట్లాడారో ఒకసారి అధికార పార్టీ నేతలు చూసుకోవాలని సూచించారు. పరిశ్రమను కాపాడమంటే.. పవన్ను కాదని, సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకొని కోరారని చెప్పారు.
ప్రజా సమస్యలపై పోరాటంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. 151 ఎమ్మెల్యేలను ఇస్తే రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిని కళ్లారా చూడాలన్నారు. సీఎం జగన్ ఇప్పుడు పాదయాత్రలు చేయాలని, హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పవన్ను నేరుగా ఎదుర్కోలేకనే సినిమా వాళ్లను వాడుకుంటున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించరని, ఆయనను వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రోడ్డు సమస్యలపై పోరాటంతో ప్రభుత్వ పెద్దలు భయపడ్డారన్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలదేని ఆరోపించారు. హామీల గురించి ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడి చేస్తారా? అంటూ మండిపడ్డారు.
కొవిడ్ సమయంలో సీఎం ఒక్క జిల్లాకైనా వచ్చారా? అని ప్రశ్నించారు. జన సైనికులు సంయమనం కోల్పోవద్దని.. కావాలనే దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను బెదిరించారని, ఎన్నికల్లో బలవంతంగా ఉపసంహరణలు చేయించారని ఆరోపించారు. అభ్యర్థులను అన్ని విధాలుగా భయపెట్టారని, అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటిందన్నారు. పార్టీ 180 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించిందని తెలిపారు. ఇప్పుడే జనసేన బలమైన ప్రతిపక్షమని, ఒక్కసారిగా ఎదుగుతుందని భయపడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. రాజకీయ పార్టీలు తమ విధానాలు, మేనిఫెస్టోలు చెప్పుకుంటాయని, కానీ.. కావాలని పవన్పై వ్యక్తిగతంగా దాడి చేయడం బాధాకరమన్నారు.