భయానికి, అజ్ఞానానికి ప్రతీకైన చీకట్లను పారదోలి ప్రతి ఒక్కరిలో నిర్భయం, విజ్ఞానానికి ప్రతిరూపమైన వెలుగును నింపే దీపావళి రానే వచ్చింది. దివ్వెల వెలుగులు, పటాకుల జిలుగులను చిన్నాపెద్దా తనివితీరా ఆస్వాదించే తరుణమాసన్నమైంది. పోయినేడు కరోనా కారణంగా నిరాడంబరంగా వేడుకలు నిర్వహించుకున్నా.. నేటి ‘వెలుగు వేడుక’ను అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది.
జనగామ, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ చౌరస్తా/వరంగల్ చౌరస్తా/ తొర్రూరు/ కృష్ణకాలనీ : చీకట్లను పారదోలే పండుగ దీపావళి. కష్టాల్లోనూ సుఖాన్ని కలగనాలనే సందేశాన్ని మానవాళికి అందిస్తోంది. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ ఇది.
సంరక్షించే పండుగ
భాద్రపద మాసంతో వర్ష రుతువు ముగిసి, ఆశ్వయుజ మాసంతో శరదృతువు ప్రారంభమవుతుంది. ఈ మాసం చివరి నాటికి వాతావరణం చల్లబడడంతో పాటు పొడిగా మారుతుంది. గాలి ద్వారా వ్యాధులను సంక్రమింపజేసే వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు అధికమవుతాయి. ముఖ్యంగా జలుబుకు కారణమైన కోల్డ్ వైరస్, దగ్గు, ఇతర శ్వాసకోశ వ్యాధులను కలిగించే వైరస్లు బ్యాక్టీరియాలు, చికెన్ ఫాక్స్ వైరస్, హెర్పెస్ జస్టిస్ వైరస్, ఫ్లూ వైరస్, మీజిల్ వైరస్, నిమోనియా వైరస్, డిఫ్తీరియా, టీబీ, కోరింత దగ్గు, గొంతు వాపు బ్యాక్టీరియల్ నిమోనియాలను కలిగించే బ్యాక్టీరియాలు, అనేక చర్మ వ్యాధులకు కారణమైన శిలీంధ్రాలు మానవులపై ప్రతాపం చూపేందుకు సిద్ధంగా ఉంటాయి. దీపావళి సందర్భంగా దీపాల కాంతికి, కాల్చే పటాకల నుంచి వెలువడే శబ్ధం, పొగ వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఈ కాంతి, మెరుపులు, పొగలో ఉండే మెగ్నీషియం, మాంగనీస్ లోహాలు, తీవ్రమైన ధ్వని వల్ల వచ్చే శక్తివంతమైన శబ్ధతరంగాలు గాలిలో వ్యాపిస్తాయి. ఇవి ఆయా వైరస్లను, బ్యాక్టీరియాలనూ, శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. దీంతో వ్యాధుల తీవ్రత చాలా తగ్గుతుంది. అలా మానవులను సంరక్షించే పండుగగా దీపావళికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగని పెద్ద మొత్తంలో కాల్చితే వాతావరణ కాలుష్యం అధికమవుతుంది.
ఈ యేడు మంచి లాభాలు
నేను 10గుంటల్లో పూలు సాగు చేసిన. పోయినేడు కరోనాతో పూలు అమ్ముడుపోక నష్టపోయిన. ఈయేడు 10గుంటలకు రూ.10వేల పెట్టుబడి అయింది. బుధవారం రెండు క్వింటాళ్ల పూలమ్మితే రూ. 40వేలు వచ్చినయ్. ఈ సంవత్సరం పూల పంటపై రూ. 30వేల లాభం వచ్చింది.
-ముత్యాల రాజేందర్, అన్సాన్పల్లి, పూల వ్యాపారి (జయశంకర్ జిల్లా)
బస్టాండ్లలో సందడి..
పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు సందడిగా మారాయి. పండుగ కోసం స్వస్థలాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేవారితో రద్దీగా కనిపించాయి. ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడుపుతున్నారు.
దివ్య దీపావళి..
నిజానికి దీపావళి రుతువులు మారే సమయంలో వస్తుంది. వర్షాలు వెనుకబడి, వ్యవసాయ పనులు ముగుస్తాయి. రైతులు పనిముట్లను శుభ్రం చేసి, మూలనపెడతారు. రాబోయే చలిని తట్టుకునేందుకు అంతా సిద్ధమవుతారు. బంధువులంతా ఒక చోటుకు చేరుతారు. కొత్తగా పెళ్లిళ్లయిన కుటుంబాల్లో కూతురును, అల్లుడిని ఆహ్వానిస్తారు. రకరకాల పిండివంటలతో సేదదీరుతారు. నోములయ్యాక ఇంటి ముందు దీపాలను వెలిగించి ఆనందిస్తారు.పటాకలు పేల్చుతూ చిన్నాపెద్దా కేరింతలు కొడతారు.
లక్ష్మీ గణపతి పూజ..
దీపావళి రోజు సిరిసంపదలకు చిహ్నమైన లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆమెతోపాటు పూజలందుకునే మరో దేవుడు గణపతి. అంటే అమావాస్య చీకట్లు అలుముకుంటుండగా, ప్రతి ఇంటా లక్ష్మీగణపతి పూజ మొదలుపెడతారు. భోగభాగ్యాలను ప్రసాదించుమని వేడుకుంటారు. అటుపై పటాకలు కాల్చడం మొదలుపెడతారు. దీంతో అప్పటి వరకు అంధకారం అలుముకున్న ఆకాశంలో దివ్య కాంతులు పూస్తాయి. చూసే అందరి మనస్సులూ ఆనంద డోలికల్లో తేలియాడుతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
పూలకు పెరిగిన డిమాండ్..
దీపావళి సందర్భంగా పూల మార్కెట్లు సందడిగా మారాయి. వ్యాపారులు తమ షాపులను, ఇళ్లను పూలతో అలంకరిస్తుండడంతో పూలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పూల ధరలు మూడింతలయ్యాయి. రైతుల నుంచి దిగుమతి భారీగా తగ్గడం, పండుగల సీజన్ మొదలు కావడంతో పూలకు డిమాండ్ భారీగా పెరిగింది. బంతి, చామంతి, మల్లెలు, కనకాంబరాల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి.
విభిన్న ఆకృతుల్లో ప్రమిదలు..
దీపావళి కోసం రకరకాల ఆకృతుల్లో రూపొందించిన ప్రమిదలు కనువిందు చేస్తున్నాయి. ఇప్పుడు మట్టి ప్రమిదల స్థానంలో అనేక డిజైన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. సంప్రదాయ ప్రమిదలతో పాటు మధ్యలో విభిన్నంగా ఉండేలా మంచి వాసననిచ్చే రంగురంగుల కేండిల్స్, రంగుల బల్బులు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ పురాణం..
నరకాసురుడనే రాక్షస రాజు ప్రజలను హింసిస్తూ ఆనందించేవాడు. అతనికి ఎదురే లేకుండా పోవడంతో భక్తజన బాంధవుడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానికి బయల్దేరుతాడు. ఆ రాక్షస సంహారానికి తానూ తోడుగా వస్తానంటుంది సత్యభామ. ఆమే స్వయంగా రాక్షస సంహారం చేస్తుంది. దీంతో నరకుడి పీడ వదిలిన ప్రజలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు. ఆనాటి నుంచి అది ఆనవాయితీగా వస్తోంది.
రూ. 40వేలు ఎక్కువ లాభం
నేను ఎకరం భూమిలో పూలు పండించిన. దీపావళి కోసం మంగళ, బుధవారాల్లో 10 క్వింటాళ్ల పూలు మార్కెట్కు తీసుకొచ్చి అమ్మిన. ఎకరం పూలసాగుకు రూ.25వేల పెట్టుబడి అయింది. పూలమ్మితే రూ. 75వేలు వచ్చాయి. మంచి లాభం వచ్చింది.