ఆరుగాలం శ్రమించే అన్నదాత.. పంట వేసింది మొదలు చేతికొచ్చి అమ్మేదాకా అనేక పాట్లు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా వరి కోతలు పూర్తయ్యాక కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరేదాక ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. తేమ ఎక్కువగా ఉందనో, దుమ్ముధూళి, తర్ర, గులకరాళ్లు, తాలు ఉందని మిల్లర్లు 5 కిలోల వరకు తరుగు తీసేస్తుంటారు. ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. వీటన్నంటిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు తీర్చేందుకు ప్యాడీ క్లీనర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని మార్కెట్ల వద్ద నిర్వాహకులు, రైతులకు అందిస్తున్నది. ఫలితంగా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు చేరి రైతులకు ఆశించిన ధర దక్కుతున్నది.
మారుతున్న విధానం.. నష్టపోతున్న రైతులు..
ఇదివరకు కూలీలు వరి కోసి మెదలుగా వేసేవారు. వారం రోజులు ఎండిన తర్వాత కుప్పలుగా వేసి మెదళ్లను ఎడ్లతో నూర్పిడి చేసేవారు. గడ్డిని, ధాన్యాన్ని వేరు చేసిన తర్వాత కరంట్ మోటర్లకు ఫ్యాన్లు పెట్టడం లేదా గాలికి తూర్పార పట్టేవారు. వారం రోజులు మెదలు ఎండడం వల్ల తేమ శాతం పూర్తిగా తగ్గిపోయేది. గాలికి లేదా మోటర్కు బిగించిన ఫ్యాన్ల ద్వారా పట్టడం వల్ల తాలు, తర్ర, తుప్పు పోయి ధాన్యం నాణ్యంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రైతులు హార్వెస్టర్లతో వరి కోసి ధాన్యాన్ని నేరుగా ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో ధాన్యం ఎండకపోవడం, తేమ ఎక్కువగా ఉండడం, తూర్పార పట్టకుండానే నేరుగా చెత్తాచెదారంతో కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. ఫలితంగా తేమశాతం ఎక్కువై రంగు మారే అవకాశం లేకపోలేదు. దీని వల్ల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారం, తేమ ఉన్నందున మిల్లర్లు తరుగు పేరుతో ధాన్యం తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది రైతులు ధాన్యాన్ని తేమశాతం తగ్గించి నాణ్యతగా తీసుకొస్తుండగా, మరికొందరు నేరుగా తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు రైతులందరి వద్ద తరుగు పేరుతో ధాన్యం తీసుకోవడం మూలంగా నాణ్యతా ప్రమాణాలు పాటించిన రైతులు సైతం నష్టపోవాల్సి వస్తోంది.
ఇలా చేయాలి..
రైతులు కూలీలతో కాకుండా వరి కోతలకు హార్వెస్టర్లను ఉపయోగించినట్లయితే వారం రోజుల పాటు ధాన్యాన్ని చేనులోనే తప్పకుండా ఎండబెట్టాలి. తేమ శాతం తగ్గిన తర్వాత మోటర్లకు బిగించిన ఫ్యాన్లు లేదా ప్యాడీ క్లీనర్ల ద్వారా తూర్పార పట్టాలి. దీంతో చెత్తాచెదారం, తాలు పోయి నాణ్యమైన ధాన్యం వస్తుంది. అప్పుడు ఆ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకెళ్తే రైతులు నష్టపోయే అవకాశం ఉండదు.
ఉచితంగా ఇస్తున్నం
కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తాలు ఉందని నిర్వాహుకులు ఇబ్బంది పెడుతుంటారు. రైతులకు నష్టం కలుగవద్దని మార్కెట్లో ఎనిమిది ప్యాడీ క్లీనర్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటిని కేంద్రాల నిర్వాహుకులు, రైతులకు ఉచితంగా అందిస్తాం. యంత్రం ద్వారా తక్కువ మంది కూలీలతో గంటకు సుమారు 30 క్వింటాళ్ల ధాన్యం తూర్పార పట్టవచ్చు. ఆ తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి, మార్కెట్కు తీసుకెళ్లి గరిష్ఠ ధర పొందవచ్చు.