న్యూఢిల్లీ: లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్(Hafiz Saeed)పై జమ్మూకశ్మీర్కు చెందిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పెహల్గామ్ ఉగ్రదాడితో లింకున్న కేసులో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. జూలై 8వ తేదీన ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక జడ్జీ ఆ ఆదేశాలు జారీ చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్పై ఎన్ఐఏ నేరాభియోగం నమోదు చేసిన తర్వాత కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. భారత్, అమెరికా దేశాలు హఫీజ్ సయీద్ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తతెలిసిందే. 2008 ముంబై ఉగ్రదాడి కేసులో మాస్టర్మైండ్ కూడా.
76 ఏళ్ల సయీద్పై సప్లమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహితో పాటు యూఏపీఏ సెక్షన్ల కింద అతనిపై కేసు బుక్ చేశారు.పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న సరోగ్దాలో సయీద్ ఉంటున్నట్లు ఎన్ఐఏ కోర్టుకు చెప్పింది. పెహల్గామ్ ఉగ్రదాడి నిందితుడైన హఫీజ్.. ప్రస్తుతం అరెస్టు నుంచి తప్పించుకున్నట్లు కోర్టు పేర్కొన్నది. హఫీజ్ అరెస్టు కోసం నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన ఎన్ఐఏ.. ఎట్టి పరిస్థితుల్లో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది.
పెహల్గామ్ ఉగ్రదాడి కేసులో నిష్పాక్షిత దర్యాప్తు కోసం సయీద్ను కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఐఏ పేర్కొన్నది. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ ఆదేశాలను జమ్మూ డీఐజీకి పంపినట్లు ఎన్ఐఏ కోర్టు తెలిపింది. 2025 ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.