జైపూర్ : హత్యకు సంబంధించిన ఆధారాలను ఓ కోతి ఎత్తుకుపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు పోలీసులే స్వయంగా కోర్టుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అవును మీరు చదివింది నిజమే. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. 2016 సెప్టెంబర్లో చందవాజీ పోలీస్స్టేషన్ పరిధిలోని శశికాంత్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి బంధువులు ఘటనపై విచారణ జరుపాలని డిమాండ్ చేస్తూ జైపూర్ – ఢిల్లీ హైవేను దిగ్భందించారు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు ఐదు రోజుల తర్వాత పోలీసులు చాంద్వాజీకి చెందిన రాహుల్ కండెరా, మోహన్లాల్ కండెరాలను అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి హత్యకు వినియోగించిన ఆయుధంతో పాటు కీలక సాక్ష్యా లను స్వాధీనం చేసుకున్నారు. హత్యనేరం కింద వారిద్దరిని జిల్లా అదనపు కోర్టులో హాజరుపరిచారు. కేసులో 15 సాక్ష్యాధారాలను సేకరించినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందులో హత్యకు ఉపయోగించిన కత్తి సైతం ఉన్నది. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా సాక్ష్యాలను సమర్పించాలని కోర్టు పోలీసులను కోరగా.. పోలీసులకు కోర్టు ఊహించని విధంగా సాక్ష్యాలను ఓ కోతి దొంగిలించిందని సమాధానం ఇచ్చారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఓ బ్యాగ్లో ఉంచామనీ, మల్ఖానాలో స్థలం లేకపోవడంతో సాక్ష్యాధారాలతో కూడిన సంచిని చెట్టుకింద పెట్టామని, ఓ కోతి సంచిని తీసుకొని వెళ్లిపోయిందంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు సమాధానమిచ్చారు.