‘జగిత్యాల- జైత్రయాత్ర’తో సామాజిక చైతన్యం నింపిన నేల. భూమి కోసం..భుక్తి కోసం.. విముక్తి కోసం వామపక్ష ఉద్యమాలకు ఊపిరులు ఊదిన గడ్డ ఇది. నా జననీ జగిత్యాల గడిచిన ఎనిమిదేండ్లుగా కొత్త రూపు దిద్దుకొంటున్నది. ఇక్కడి జనుల చిరకాల వాంఛ తీరి ప్రత్యేక జిల్లాగా అవతరించింది. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొంటూ సంక్షేమం, అభివృద్ధికి ప్రతిరూపంగా నిలుస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్లుగా సాగిస్తున్న కృషి మూలంగా జగిత్యాల జిల్లా నేడు దేశంలోనే గొప్ప వ్యవసాయిక జిల్లాగా మారింది.కలలో కూడా ఊహించని స్థాయిలో నీటి పారుదల సౌకర్యం లభించి, అన్నం గిన్నెగా రూపాంతరం చెంది ంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి వ్యూహాలతో జగిత్యాల జిల్లా ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నది. ఒకవైపు పరిశ్రమల స్థాపనకు కృషి, మరో వైపు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు జరుగుతున్న ప్రయత్నం జగిత్యాల ప్రజల్లో మనోైస్థెర్యాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతున్నది. నిరుద్యోగులకు చేయూత ఇవ్వడానికి స్టడీ సర్కిల్స్ ఏర్పాటయ్యాయి. వివిధ కళాశాలల మంజూరుతో నాణ్యమైన విద్యకు కేంద్రంగా భాసిల్లుతున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధికి ఇదొక మచ్చుతునకగా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, చిత్తశుద్ధికి, పరిపాలనా సామర్థ్యానికి జగిత్యాల ఒక ప్రతీక.
తెలంగాణ అంతటి మాదిరిగానే జగిత్యాలలో కూ డా ఒకనాడు నెర్రలు బారిన నేలలు, నోళ్లు తెరిచిన బావులు ఉండేవి. పాతాళం చేరిన భూగర్భ జలాలతో జగిత్యాల తల్లడిల్లింది. ఎనిమిదేండ్ల కిందటితో పోల్చి తే ఏకంగా 1.10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగిం దంటే జగిత్యాల వ్యవసాయానికి ఎంతగా కీలకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2014లో 2,59, 255 ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంటే ఈ ఏడాది 3,69, 653 ఎకరాలకు సాగు వృద్ధి చెందింది. 2014 లో 1,38,502 ఎకరాల్లో వరి పంట సాగైతే ఈ ఏడాది 3,01,820 ఎకరాలకు విస్తరించింది. జగిత్యాల నిండు కుండ లాంటి చెరువులతో సస్యశ్యామలమైంది.
పోచంపాడు తలాపునే ఉన్నా చివరి భూములకు నీరు అందకపోయేది. ఇప్పుడు ప్రభుత్వం రూ. 1960 కోట్ల వ్యయంతో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం రూపొందించింది. రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు పంటలకు నిండుగా నీళ్లను అందిస్తున్నది. వరద కాలువలకు తూములు పెట్టి, తాంబాలంలా మారిన దా దాపు 700 చెరువులను మిషన్ కాకతీయ పథకంతో గంగాళంలా మార్చింది. నేడు జిల్లాలో ఏ మూల చూసినా భూగర్భ జలాలు సగటున నాలుగు నుంచి ఐదు మీటర్ల పైకి ఉబికి వచ్చాయి. ఎక్కడ చూసినా జల సవ్వడులు వినిపిస్తున్నాయి. బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించేందుకు దాదాపు రూ.100 కోట్ల కేటాయింపు జరిగింది. రోళ్లవాగు సామర్థ్యాన్ని 0.25 టీఎంసీల స్థాయి నుంచి ఒక టీఎంసీ స్థాయికి పెంచేందుకు ఆధునీకరణ పను లు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయి తే జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో దాదాపు పాతిక వేల ఎకరాల్లో పంట స్థిరీకరణ జరుగుతుంది.
జగిత్యాల ప్రజల చిరకాల కోరిక జిల్లా ఏర్పాటుతో తీరిపోయింది. అయితే కేసీఆర్ అక్కడితో వదలివేయకుండా జిల్లా ప్రజలు గర్వపడే రీతిలో రూ.100 కోట్ల వ్యయంతో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్)ను నిర్మించారు. ఇది ప్రజల సౌకర్యం కోసమే కావచ్చు. కానీ ప్రజలు దీనినొక స్వాభిమాన సూచికగా భావించి గర్వపడుతున్నారు.
20 ఎకరాల్లో జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించాలని ప్రభుత్వం 2017లో నిర్ణయించింది. ఎనిమిది ఎకరాల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. జీ ప్లస్ 2 పద్ధతిలో 19,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లా స్థాయి అధికారుల గృహ సముదాయాలను నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారుల క్యాంపు కార్యాలయాల నిర్మాణం ఇప్పటికే జరిగిపోయింది. ప్రస్తుతం కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఆయా క్యాంపు కార్యాలయాల నుంచే విధులను నిర్వర్తిస్తున్నారు.
జగిత్యాల కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వైద్య కళాశాల. జగిత్యాల జిల్లా ప్రజలు తమకు వైద్య కళాశాల లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో పాటు, దానికి రూ.119 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 29 కోట్ల రూపాయలతో తాత్కాలిక భవనంలో మెడికల్ కాలేజీని, దానికి అనుబంధంగా 370 పడకల ఆసుపత్రిని సైతం ఏర్పాటు చేశారు. 150 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ తరగతులు ఈ ఏడాది నవంబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సౌకర్యాలు ఏర్పా టు చేస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల, కోరు ట్ల, ధర్మపురి నియోజకవర్గ కేంద్రాలో దాదాపు వందలాది మంది కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ అందించే కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని దవాఖానల స్థాయిని వంద పడకలకు, ధర్మపురి హాస్పిటల్ స్థాయిని 50 పడకలకు పెంచారు. విద్యారంగ అభివృద్ధికీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడం పట్ల ఇక్కడి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగులకు చేయూత లభించింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పరిధిలో స్థానిక విద్యార్థుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 12 గురుకులాలను ఏర్పాటు చేసింది.
పారిశ్రామిక రంగాన్ని వృద్ధి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వ కృషి ప్రశంసనీయమైనది. రూ.15 కోట్ల వ్యయంతో లక్షింపూర్ గ్రామ పరిధిలో విత్తన శుధ్ధి కేంద్రం ఏర్పాటవుతున్నది. ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వెల్గటూర్ మండలంలో ప్రఖ్యాతి గాంచిన క్రిభ్కో కంపెనీతో సంయుక్తంగా ఇథనాల్ పరిశ్రమను ప్రారంభించడానికి అడుగులు పడ్డాయి. ఈ పరిశ్రమ ద్వారా 7 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని వినియోగించుకోవడంతో పాటు లక్షలాది ఎకరాల్లో పండి ంచిన పంట గడ్డిని, దొడ్డు బియ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. అట్లనే 1400 మంది యువకులకు ఉద్యోగాలు లభిస్తాయి. మరో రెండువేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. ఇతర పరిశ్రమల ద్వారా కూడా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక భాగం మాత్రమే.
ప్రజల సౌకర్యం కోసమైనా, పారిశ్రామికాభివృద్ధికైనా రహదారులు కీలకమైనవి. రాయికల్ మండలంలోని బోర్నపల్లి, నిర్మల్ జిల్లాలోని చిన్న బెల్లాల మధ్య గోదావరి నదిపై దాదాపు కిలోమీటర్ పొడవున రూ.70 కోట్ల వ్యయంతో వంతెనను నిర్మించడంతో పూర్వ ఆదిలాబాద్ జిల్లా, పూర్వ కరీంనగర్ జిల్లా మధ్య రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. ప్రజలకు దూరాభారం తప్పింది. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రూపొందించినదే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం. ఈ పథకంలో భాగంగా జిల్లా కేంద్రం చేరువలోని నూకపల్లిలో 4000 గృహాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం సాగుతున్నది.
జగిత్యాలలో ఎటు చూసినా అభివృద్ధి ఫలాలు కని పిస్తున్నాయి. రూ.40 కోట్ల వ్యయంతో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో సమీకృత పోలీసు భవనం నిర్మితమవుతున్నది. రూ.20 కోట్లతో మాతా శిశు కేంద్రం ఏర్పా టు మరో విశేషం. జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరువలోని చల్గల్ గ్రామంలో లక్ష చదరపు అడుగుల మామి డి మార్కెట్ ఏర్పాటు కావడంతో మామిడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరింది. జగిత్యాల మామిడి పండ్లు నాణ్యంగా ఉంటాయి. ఉత్తర భారత దేశానికి జగిత్యాల మామిడి పండ్లు ఎగుమతి చేసేందుకు రైతులకు మహదావకాశం లభించింది. పొలాసలోని వ్యవసాయ కళాశాలకు ఆధునిక సదుపాయాలు కల్పించడానికి 15 కోట్లతో కొత్త భవనం నిర్మితమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక పరిపాలన మీద ఎంతో దృష్టి పెట్టారనేది తెలిసిందే. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడంతో పాటు విధులు అప్పగించడం సత్ఫలితాలను ఇస్తున్నది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి మున్సిపాలిటి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు సమకూర్చింది. వాటి వినియోగంతో పట్టణాల్లో రూపురేఖలు మారాయి. జగిత్యాలలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. మరోవైపు జగిత్యాల శివారులోని దరూరు నుంచి చల్గల్ మీదుగా ఎప్పుడో సిద్ధమైన రోడ్డు పాలకుల నిర్లక్ష్యంతో అందుబాటులోకి రాలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని రైల్వే అధికారులతో మాట్లాడి రాకపోకలకు సిద్ధం చేసింది. ఇప్పుడు అదే రోడ్డును నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నది. కొత్తగా రాయికల్, బీర్ పూర్, ఇబ్రహీంపట్నం మండలాలు ఏర్పాటయ్యాయి. ఇటీవల భీమారం మండలం కూడా ఏర్పాటయింది. దీంతో పరిపాలన సౌలభ్యం మరింత పెరిగింది. ప్రజల దగ్గరికి ప్రభుత్వం చేరింది.
జగిత్యాలలో రైల్వే స్టేషన్ మొక్కుబడిగా ఉండేది. కానీ నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నపుడు కరీంనగర్ మీదుగా ముంబై రైలు ప్రారంభానికి చొరవ తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నేరవేరింది. మల్యాల, జగిత్యాల, మేడిపల్లి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల ప్రజలకు ముంబై నగరంతో బంధుత్వాలు ఎక్కువ. అందువల్ల అనతి కాలంలోనే ఈ రైలుకు ప్రజల నుంచి ఆదరణ పెరిగింది.
– కచ్చు మేఘ శ్యామ్
98480 70547
(వ్యాసకర్త : రాజనీతి శాస్త్ర అధ్యాపకులు)