104 మారథాన్స్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. పరుగు అనేది నా మానసిక స్థితిపై ప్రభావం చూపించింది. పరుగు ద్వారా నా శరీరం ఎంత ధృడమైందో తెలిసింది. ఈ ఫీట్తో నా సామర్థ్యం ఏంటో ప్రపంచానికి పరిచయం అయ్యింది.
– జాకీ హంట్
జొహన్నెస్బర్గ్: పరుగును ఆమె ప్రాణంగా ప్రేమించింది. ఓవైపు క్యాన్సర్ మహమ్మారితో కాలు లేకపోయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆగదు ఈ పయనం అన్నట్లు ముందుకు సాగింది. దక్షిణాఫ్రికాకు చెందిన జాకీ హంట్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు.
26 ఏండ్ల క్రితం అరుదైన బోన్(ఎముక) క్యాన్సర్ బారిన పడింది. వ్యాధి పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత వైద్యుల సూచన మేరకు ఎడమకాలుకు శస్త్రచికిత్స చేసి తీసేశారు. ఓవైపు అంగవైకల్యం ఆటంకంగా మారినా..మొక్కవోని దీక్షతో హంట్ ఈ ఏడాది జనవరిలో తన పరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఏకబిగిన 104 రోజుల్లో 104 మారథాన్లను పూర్తి చేసి సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పింది.
ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్కచేయకుండా హంట్ ముందుకు సాగింది. 2016లో మారథాన్కు ఎంచుకున్న 46 ఏండ్ల హంట్..తొలుత 100 రోజుల్లో 100 మారథాన్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2020లో దివ్యాంగ రన్నర్ కేట్ జైడెన్ 101 రోజుల్లో 101 మారథాన్లు పూర్తి చేసింది. దీంతో మనసు మార్చుకున్న జాకీ హంట్ 104 మారథాన్లు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగింది. ఈ అలుపెరుగని ఈ సుదీర్ఘ ప్రయాణంలో హంట్ ఏకంగా 4400 కిలోమీటర్లు పరిగెత్తింది. ఇదిలా ఉంటే ఈ రికార్డు అధికారికంగా నమోదు కావడానికి మూడు నెలల సమయం పడుతుందని గిన్నిస్ బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు.