తిరువనంతపురం: ఆమె పేరు కేకే శైలజ. జనం ఆమెను ప్రేమగా శైలజా టీచరు అని పిలుస్తారు. ఆమె గురించి, ఆమె విజయాలు గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. మొన్నటి నీపా వైరస్ను, నిన్నటి కరోనా వైరస్ను అదుపు చేయడంలో ఆమె పాత్ర ప్రఖ్యాతం. కేరళ ఆరోగ్య మంత్రిగా నీపా వైరస్ను ఏరిపారేసిన ఆమె చరిత్ర సినిమాకెక్కింది. ఆ మలయాళ సినిమా పేరు వైరస్. అందులో శైలజ పాత్రను ప్రముఖ నటి రేవతి పోషించారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఇటీవలి కరోనా కల్లోలం తొలిదశలో ఆమె కేరళను ఒడ్డున పడేశారు. అంతేనా అంటే ఇంకా చాలా ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఇంకేముంది మళ్లీ ఆమెకు ఆరోగ్య శాఖ ఖాయం అంటూ మీడియా కథనాలు వెల్లువెత్తాయి. కానీ కథ అడ్డం తిరిగింది. చరిత్రాత్మక విజయం సాధించిన సీపీఎం ఆమెను మంత్రిలవర్గంలో చేర్చుకోరాదని నిర్ణయించింది. కోవిడ్ నిుర్వహణలో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన శైలజతో సహా పాత మంత్రులెవరినీ కొత్త మంత్రవర్గంలోకి తీసుకోరాదని సీపీఎం నిర్ణయించింది. కొత్తమంత్రివర్గంలో దాదాపు అందరూ కొత్తవారే ఉంటారని పార్టీ నిర్ణయించింది. సీఎం పినరాయి విజయన్ కు మాత్రమే పార్టీ మినహాయింపు ఇచ్చింది. శైలజను పార్టీ విప్గా నియమించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటున్నారు శైలజ. అది పార్టీ విధాన నిర్ణయం. ఆ మేరకు నేను కూడా తప్పుకుందామనే నిర్ణయించుకున్నాను అని ఆమె ఎన్డీటీవీకి చెప్పారు. సోషల్ మీడియాలో దీనిపై వెల్లువెత్తుతున్న నిరసనలను ప్రస్తావిస్తే, ఇలా ఆవేశం సహజమే అన్నట్టుగా ఆమె మాట్లాడారు. నేను కూడా ఒకప్పుడు కొత్తమంత్రినే కదా అని కూడా ఆమె సర్దిచెప్పారు. “కొత్త బాధ్యతలు అప్పజెప్పినప్పుడు అందరూ అనుభవం లేనివారే కదా.. కొత్తవారే కదా.. మా పార్టీలో ఎందరో ఉన్నారు.. అవకాశం దొరికితే వారూ కష్టపడి పనిచేస్తారు” అని శైలజ అన్నారు. పైగా నా ఒక్కదాన్నే పక్కన పెట్టలేదు కదా.. ఏ ఒక్క మంత్రికీ తిరిగి పదవి ఇవ్వరాదని తీర్మానించారు కదా అని ఆమె అన్నారు. గత ఐదేళ్ల పదవీకాలం గురించి ప్రస్తావించగా సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం గర్వంగా ఉందని చెప్పారు.