అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు ఇవాల్టి నుంచి మరో విడత మహాపాద్ర చేపట్టారు. రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా పాదయాత్రను కాస్తా ఫేక్ యాత్రగా అభివర్ణించారు. దాంతో మంత్రి అంబటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా నెటిజెన్లు అంబటిపై తీవ్ర విమర్శలు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు.
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనాసాగించాలనే డిమాండ్తో రైతులు గతంలో కూడా మహా పాదయాత్ర చేపట్టారు. కాగా, వారు చేపట్టిన ఆందోళనకు 1000 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరో విడత మహాపాదయాత్రకు పూనుకున్నారు. రైతుల పాదయాత్రపై ఆగ్రహంతో ఉన్న మంత్రి అంబటి రాంబాబు.. ట్విట్టర్ వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు. ‘అది మహా ఫేక్ యాత్ర’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఆ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి రాస్తున్నట్లు వెల్లడించలేదు.
మంత్రి అంబటి రాంబాబు ట్వీట్పై నెటిజెన్లు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేస్తున్న పాదయాత్రపై ఇలా మంత్రి తన అక్కసును వెళ్లగక్కడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జగన్ చేపట్టిన పాదయాత్రను ఏమంటారు అంబటి? అంటూ ప్రశ్నించారు. డైలాగులు చెప్పమంటే భలే చెప్తారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల గురించి నీ బాధ మొసలికన్నీరేనా అని నిలదీశారు. కాగా, రైతుల మహా పాదయాత్రపై మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా తీవ్రంగా స్పందించారు. గురజాడ బతికుంటే రాష్ట్రమంటే 29 గ్రామాలు కాదోయ్.. 26 జిల్లాలోయ్ అనే వారేమో అంటూ సెటైరికల్గా ట్వీట్ చేశారు.