రివ్యూ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్రాజ్ తదితరులు
కెమెరా: రాంరెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సంభాషణలు: అబ్బూరి రవి
నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత: రాజేష్ దండా
రచన-దర్శకత్వం: ఎ.ఆర్.మోహన్
కామెడీ పాత్రల్లో ఎంతటి వినోదాన్ని పండిస్తాడో..ఎమోషనల్ కథల్లో కూడా తనదైన నటనతో మెప్పిస్తుంటారు అల్లరి నరేష్. ఆయన గత చిత్రం ‘నాంది’ పోలీస్, కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో విమర్శకుల ప్రశంసలందుకొంది. తాజాగా నరేష్ మరో సామాజిక సమస్యను చర్చిస్తూ రూపొందించిన ‘ఇట్లు మారేడుమిల్లి’ చిత్రంలో నటించారు. మరి ఈ సినిమాలో చర్చించిన సామాజికాంశం ప్రేక్షకులకు ఎంత వరకు చేరువైంది? ఈ చిత్ర ద్వారా నరేష్ మరో విజయాన్ని అందుకోగలిగారా తెలుసుకుందా..
కథ గురించి:
శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) తెలుగు ఉపాధ్యాయుడు. వ్యవస్థలోని అన్యాయాల్ని సహించని మనస్తత్వం అతనిది. రంపచోడవరం ఉపఎన్నికల కోసం మారుమూల అటవీ ప్రాంత గ్రామం మారేడుమిల్లిలో విధుల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. అక్కడ వందశాతం పోలింగ్ జరగాలని కలెక్టర్ (సంపత్రాజ్) ఆదేశించడంతో ఇంగ్లీష్ టీచర్ వెన్నెల కిషోర్తో కలిసి మారేడుమల్లి చేరుకుంటాడు శ్రీనివాస్ శ్రీపాద. ఎన్నో ఏళ్లుగా హామీలుగానే మిగిలపోయిన పాఠశాల, ఆసుపత్రి, వాగు దాటడానికి వంతెన నిర్మాణం పూర్తయితేనే తాము ఓటు వేస్తామని మారేడుమిల్లి గ్రామస్తులు భీష్మించుకు కూర్చుంటారు. ఆ తర్వాత ఓ గర్భిణీ స్త్రీని చనిపోయే ప్రమాదం నుంచి శ్రీనివాస్ శ్రీపాద రక్షించడంతో గ్రామస్తులకు అతనిపై నమ్మకం ఏర్పడుతుంది. దాంతో ఎన్నికల్లో పాల్గొని వందశాతం ఓట్లు వేస్తారు. ఎన్నికలు పూర్తిచేసుకొని తిరిగి వెళ్లే సమయంలో అనూహ్యంగా శ్రీనివాస్ శ్రీపాద, వెన్నెల కిషోర్లను గ్రామస్తులు నిర్భందిస్తారు. తమ హామీలను నెరవేర్చితేనే వారిని విడుదల చేస్తామని చెబుతారు. మరోవైపు ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరపడుతుంటుంది. ఈ సమయంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గ్రామస్తులు మంచి వాడని నమ్మిన టీచర్ శ్రీనివాస్ శ్రీపాద నిర్భందానికి కారణాలేమిటి? అటవీ గూడెం మారేడుమిల్లి ప్రజానీకం తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారా? అన్నదే మిగతా కథ..
కథా విశ్లేషణ:
సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా… ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నా ఇప్పటికీ కనీస అవసరాలు నోచుకోని గ్రామాలు దేశంలో కొన్ని వేలల్లో ఉన్నాయనే మాట వాస్తవం. విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ గ్రామ సమస్యను ఎలక్షన్ తంతుతో ముడిపెట్టి సామాజిక కోణంలో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. ప్రస్తుతం వస్తున్న కమర్షియల్, ప్రేమకథా చిత్రాల ఒరవడిలో ప్రజల సమస్యను సినిమా ద్వారా విన్నవించుకోవాలనే దర్శకుడు ప్రయత్నం అభినందనీయమే. ఎన్నికల నేపథ్యంలో గతంలో చాలా చిత్రాలొచ్చినా ఈ సినిమాలో ఎంచుకున్న పాయింట్ కొత్తగానే అనిపిస్తుంది. అయితే ఎలాంటి సీరియస్ కథనైనా ఎంగేజింగ్గా చెప్పగలిగితేనే ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడు తడబడ్డారనిపించింది. చక్కటి సందేశాన్ని అందించే ప్రయత్నం చేసినా ఎమోషన్స్ అంత బలంగా పండలేదనిపిస్తుంది. ప్రథమార్థంలో శ్రీనివాస్, వెన్నెల కిషోర్ మారేడుమిల్లికి చేరుకోవడం, అక్కడ ప్రజలను ఒప్పించి వారిని ఓటు వేసేందుకు ప్రేరేపించడం, ఈ క్రమంలో శ్రీనివాస్కు మారేడుమిల్లికి చెందిన మహాలక్ష్మి (ఆనంది) తోడుగా ఉండటం..ఈ ఎపిసోడ్ అంతా కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. శ్రీనివాస్ బృందాన్ని గ్రామస్తులు నిర్భంధించడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.
ద్వితీయార్థంలో కథాగమనం పట్టు తప్పింది. సన్నివేశాలన్ని సాగతీతగా అనిపిస్తాయి. శ్రీనివాస్ బృందాన్ని విడిపించడానికి కలెక్టర్ చేసే ప్రయత్నాలు, మిలటరీ ఆపరేషన్ వంటి ఎపిసోడ్స్ సిల్లీగా అనిపిస్తాయి. ప్రజా సమస్యల్ని ప్రస్తావించే కథాంశాల్లో స్ట్రాంగ్ ఎమోషన్స్ పండాలి. కథలోని సమస్యతో ప్రేక్షకులు కూడా కనెక్ట్ కావాలి. అది ఈ సినిమాలో లోపించిందనిపిస్తుంది. చాలా సన్నివేశాలు సందేశాలు ఇస్తున్నట్లుగా అనిపిస్తాయి కానీ..వాటితో ప్రేక్షకులు ఎక్కడా ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోతారు. నాయకా, నాయికల పరిచయం, ప్రేమ ఎపిసోడ్లో కూడా ఏ మాత్రం భావోద్వేగాలు కనిపించలేదు. క్లెమాక్స్ను కూడా రొటీన్గానే ముగించారు. అయితే ఈ సీరియస్ కథలో కూడా చక్కటి వినోదాన్ని పండించడం రిలీఫ్గా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ తనదైన హాస్యంతో మంచి వినోదాన్ని అందించాడు. సెకండాఫ్లో కోటేశ్వరరావు (రఘుబాబు) కామెడీ ఎపిసోడ్ నవ్వులి పంచుతుంది. అబ్బూరి రవి రాసిన సంభాషణలు ఆలోచించజేసేలా ఉన్నాయి. డైలాగ్స్ మాదిరిగా సన్నివేశాల్ని కూడా మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. ప్రజల స్థితిగతులు మారాలంటే రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా తమదైన బాధ్యతను నిర్వర్తించాలనే సందేశం ఆకట్టుకుంటుంది.
నటీనటులు పర్ఫార్మెన్స్:
ఈ తరహా పాత్రలు చేయడం నరేష్కు కొత్తేమీ కాదు. తన పాత్రకు ఆయన పూర్తిగా న్యాయం చేశాడు. మంచి వ్యక్తిత్వం కలిగిన శ్రీనివాస్ శ్రీపాద పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. పల్లెటూరి అమ్మాయి మహాలక్ష్మిగా ఆనంది నటన బాగుంది. తెరపై ఆమె అందంగా కనిపించింది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్గా నిలుస్తుంది. ప్రవీణ్, రఘుబాబు కామెడీ కూడా బాగుంది. కలెక్టర్ పాత్రలో సంపత్రాజ్ తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు. శ్రీతేజ్, సేతు రామన్, జెమినీ సురేష్ తదితరులు పరిధుల మేరకు నటించారు. ఇక నిర్మాణపరంగా మంచి క్వాలిటీ కనిపించింది. రాంరెడ్డి కెమెరా అటవీ నేపథ్యాన్ని అందంగా చూపించింది. ఆర్ట్ వర్క్ బాగుంది. సాంకేతికంగా అన్ని విభాగాల్లో చక్కటి అవుట్పుట్ కనిపించింది.
తీర్పు:
ప్రజా సమస్యల్ని సినిమా ద్వారా చర్చించాలనుకోవడం మంచి ప్రయత్నమే. అయితే కథ, కథనాల్లో కొత్తదనంతో పాటు బలమైన ఎమోషన్స్ ఉన్నప్పుడే ఆ సందేశం ప్రేక్షకులకు చేరువవుతుంది. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’లో సందేశం ఆకట్టుకున్నా.. ఎమోషన్ మిస్సయిందనే చెప్పాలి.
రేటింగ్: 2.5/5.