ముంబై: జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్ర రామకృష్ణ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ఈ మేరకు ముంబై ఐటీ శాఖ వెల్లడించింది. పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఒక హిమాలయ యోగితో చిత్ర పంచుకొన్నారని, ఆయన సూచనలతోనే ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్తో పాటు పలు కీలక పదవుల్లో క్యాపిటల్ మార్కెటింగ్పై ఎలాంటి అవగాహన లేని ఆనంద్ సుబ్రమణియన్ను నియమించారని సెబీ దర్యాప్తులో ఇటీవల తేలింది. ఎన్ఎస్ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మౌనం వహించడంపై కాంగ్రెస్ మండిపడింది. హిమాలయాల్లోని ఓ యోగి.. రూ.300 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ను (ఎన్ఎస్ఈ) అక్కడ నుంచే ఎలా నడిపించారని, ఆ యోగి ఐపీ అడ్రస్ను ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతున్నదని ప్రశ్నించింది.