దివ్యాంగుల సంక్షేమ దినం ర్యాలీలో
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ ఖైరతాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మాదిరిగానే దివ్యాంగులకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి కమిషన్లను ఏర్పాటుచేయాల్సిన అవసరమున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఇదే అంశంపై ఇటీవల తాను కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్కు లేఖ రాయగా, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల సంక్షేమ దినం సందర్భంగా శుక్రవారం అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్రోడ్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు చట్టపరంగా, సామాజికంగా రక్షణ లభించాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఉద్యోగ, ఉపాధిరంగాల్లో మరిన్ని రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సూచించారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని, 4,90,630 మందికి ప్రతి నెలా రూ.3,016 చొప్పున పెన్షన్లు అందజేస్తున్నట్టు వివరించారు. దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను పంపిణీచేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శారీరక వైకల్యాన్ని అధిగమించి సివిల్, స్టేట్సర్వీస్, రాజకీయాలు, వైద్యం, న్యాయం, విజ్ఞానం వంటి అనేక రంగాల్లో ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికలాంగుల హకుల వేదిక చైర్మన్ కొల్లి నాగేశ్వరరావు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సాధికారతకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల సంక్షేమ దినం సందర్భంగా జాతీయ మేథో వికలాంగుల సాధికారత సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థికాంశాల్లో దివ్యాంగులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వీరికి ప్రాధాన్య ప్రాతిపదికన సమానావకాశాలు, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.కార్యక్రమంలో జాతీయ మేథో వికలాంగుల సాధికారత సంస్థ డైరెక్టర్ మేజర్ బీవీ రామ్కుమార్ పాల్గొన్నారు.
రాజ్భవన్లో ల్యాప్టాప్లు..
‘డొనెట్ ఏ డివైజ్ క్యాంపెయిన్’లో భాగంగా విరాళంగా వచ్చిన 20 ల్యాప్టాప్లు, రెండు ట్యాబ్లను శుక్రవారం రాజ్భవన్లో నిరుపేద విద్యార్థులకు గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు. నిరుపేద విద్యార్థులు ఆన్లైన్లో ఇతర విద్యార్థులతో సమానంగా చదువుకొనడానికి వీలుగా ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర దాతలు ల్యాప్టాప్లు, ట్యాబ్లను విరాళంగా ఇవ్వాలని గవర్నర్
పిలుపునిచ్చారు.