న్యూఢిల్లీ, నవంబర్ 16: ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని రియల్ ఎస్టేట్ గ్రూప్లపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఈ నెల 10న హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో మూడు వేర్వేరు రియల్టీ సంస్థలకు చెందిన 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు రూ.75 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు మంగళవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలిపింది. రూ.1.20 కోట్ల నగదును, రూ.90 లక్షల విలువైన నగలను జప్తు చేసినట్లు వివరించింది. అలాగే నేరాలను రుజువు చేసే పలు డిజిటల్ సాక్ష్యాలు, దస్తూరి పుస్తకాలు, అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలనూ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నది. 9 బ్యాంక్ లాకర్లపై ప్రొహిబిటరీ ఆర్డర్లనూ జారీ చేశామన్నది. నగదు లావాదేవీలను ఖాతా పుస్తకాల్లో చూపకుండా ప్రభుత్వ ఆదాయానికి ఈ సంస్థలు గండి కొడుతున్నాయని సీబీడీటీ చెప్పింది.