న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశంలో బిట్కాయిన్ లేదా ఆ తరహా క్రిప్టోకరెన్సీలు చట్టబద్ధమైనవా?.. కావా?.. అని కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది. క్రిప్టోకరెన్సీలపై ప్రభుత్వ వైఖరేంటో తెలియపర్చాలన్నది. బిట్కాయిన్ లాభాల కుంభకోణానికి సంబంధించి జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగానే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా నిలదీసింది. క్రిప్టోలపై ప్రభుత్వ విధానమేంటో ప్రకటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. కాగా, ఎలాంటి చట్టం తేకుండానే క్రిప్టో లావాదేవీలు, ఆదాయంపై ఇటీవలి బడ్జెట్లో మోదీ సర్కారు పన్నులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.