అమరావతి : టీడీపీకి వరుస ఓటమి పరంపరలు కొనసాగుతున్నాయి. కంచుకోటగా ఉన్న కుప్పం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గం లోనూ ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లను కోల్పోయిన టీడీపీ తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో 19 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించగా టీడీపీ కేవలం 6 సీట్లలో మాత్రమే గెలిచింది. చంద్రబాబు కోటను దెబ్బతీయడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి రాజకీయంగా పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కుప్పంలో వైసీపీ విజయం సాధించడం పట్ల పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కుప్పం ఓటమితో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఈ స్థానం నుంచి పోటీ చేస్తారని అనుకోవడం లేదన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పాలన సాగుతోందని, దాని ఫలితంగానే కుప్పం మున్సిపాలిటీలో ఘన విజయం సాధించిందని మంత్రి వ్యాఖ్యానించారు.