IRF To Gadkari | వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు తప్పనిసరి ఏర్పాటు చేయాలన్న నిబంధనపై కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్ల నిబంధన తప్పనిసరిపై రోడ్ సేఫ్టీ బాడీ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒకవేళ ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఐఆర్ఎఫ్ లేఖ రాసింది.
దేశంలోని కార్లలో ప్రయాణిస్తున్న వారిలో 85 శాతం సీట్బెల్ట్లు పెట్టుకోవడం ప్రారంభించాక.. ఆయా కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాలని ఐఆర్ఎఫ్ తన లేఖలో పేర్కొంది. అలా కాకుంటే ఆరు ఎయిర్బ్యాగ్ల నిబంధన అమలు చేస్తే మరిన్ని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవచ్చునని ఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ ఎమిరస్ కేకే కపిలా పేర్కొన్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అపాయం తగ్గించడానికి ఎయిర్బ్యాగ్లు సప్లమెంటరీ సపోర్ట్గా నిలుస్తాయన్నారు. సీట్ బెల్టు లేకుండా ఎయిర్బ్యాగ్లు వాడినప్పుడు ప్రమాదాలు జరిగితే తీవ్ర గాయాలు.. ఒక్కోసారి మరణాలు సంభవించొచ్చునని పలు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయన్నారు.
కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ డేటా ప్రకారం హెల్మెట్ ధరించని వారే టూ వీలర్ యాక్సిడెంట్లలో 70 శాతం మరణిస్తున్నారు. కారు ప్రమాదాల్లో 87 శాతం మంది సీట్ బెల్ట్ ధరిచని వారే తీవ్ర గాయాల పాలవుతున్నారు.. లేదా మరణిస్తున్నారని కపిల గుర్తు చేశారు.