న్యూఢిల్లీ, మే 18 : అమెరికా, ఇరాన్ యుద్ధానికి ముగింపు లేకపోవడం, హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధం కొనసాగుతుండడంతో ప్రపంచం చమురు సంక్షోభంలో చిక్కుకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు డబ్బు సంపాదించడానికి ఆ జలమార్గం కింద వేసిన సముద్రగర్భ కేబుళ్లపై దృష్టి సారించింది. గూగుల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ టెక్ కంపెనీల నుండి ఈ సముద్రగర్భ కేబుళ్లను ఉపయోగించుకున్నందుకు రుసుము వసూలు చేయాలని ఇరాన్ ఇప్పుడు యోచిస్తున్నట్లు సీఎన్ఎన్ వార్తాసంస్థ వెల్లడించింది. ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు విధిస్తామని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహిం జోల్ఫాఘరీ గత వారం ఎక్స్లో ప్రకటించారు. ఇరాన్కు సహకరించడానికి నిరాకరిస్తే ప్రాంతీయ అంతరాయాలు ఏర్పడవచ్చని, దాని వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగవచ్చని, ఈ-కామర్స్లో లోపాలు తలెత్తవచ్చని, ప్రభావిత ప్రాంతాలలో డబ్బు బదిలీలు నిలిచిపోవచ్చని ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు అస్పష్టంగా హెచ్చరించాయి.
ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలను అతిక్రమించకుండా సముద్రగర్భ కేబుళ్లను ఉపయోగించుకుంటున్న గూగుల్, అమెజాన్, మెటా వంటి కంపెనీలు ఇరాన్కు ఎలా చెల్లింపులు చేయగలవో స్పష్టత లేదు. భారత్, ఆగ్నేయాసియా దేశాలను గల్ఫ్ దేశాలు, ఈజిప్టు మీదుగా ఐరోపాకు కలుపుతూ అనేక ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లు జలసంధి సముద్రగర్భం గుండా పాములా విస్తరించి ఉన్నాయి. సముద్రగర్భ కేబుళ్లు డేటా, విద్యుత్తును ప్రసారం చేయడానికి సముద్రపు అడుగున వేసిన ఫైబర్-ఆప్టిక్ లేదా విద్యుత్ కేబుళ్లు. ఐక్యరాజ్య సమితి డిజిటల్ టెక్నాలజీల ప్రత్యేక సంస్థ ఏటీయూ ప్రకారం ఇవి ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో సుమారు 99% తీసుకెళ్తాయి. అవి దేశాల మధ్య టెలికమ్యూనికేషన్లు, విద్యుత్తును కూడా రవాణా చేస్తాయి. క్లౌడ్ సేవలు, ఆన్లైన్ కమ్యూనికేషన్లకు ఇవి అత్యవసరం.
హొర్ముజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని ప్రధాన కేబుళ్లలో ఆసియా-ఆఫ్రికా-యూరప్ 1(ఏఏఈ-1) కూడా ఒకటి. అవి ఆగ్నేయాసియాను ఈజిప్టు ద్వారా ఐరోపాకు కలుపుతాయి. దీనికి యూఏఈ, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలో ల్యాండింగ్ పాయింట్లు ఉన్నాయి. ఫాల్కన్ నెట్వర్క్, భారత్, శ్రీలకంను గల్ఫ్ దేశాలు, సూడాన్, ఈజిప్టులను కలుపుతుంది. గల్ఫ్ బ్రిడ్జ్ అంతర్జాతీయ కేబుల్ వ్యవస్థ ఇరాన్తో సహా అన్ని గల్ఫ్ దేశాలను కలుపుతుంది. కేబుళ్లు దెబ్బతింటే ఇంటర్నెట్ వేగం తగ్గడం లేదా అంతరాయాలు ఏర్పడటం, ఈ కామర్స్కు ఆటంకాలు, ఆర్థిక లావాదేవీలు ఆలస్యం కావడం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని భౌగోళిక రాజకీయ, ఇంధన విశ్లేషకురాలు మాషా కోట్కిన్ తెలిపారు.