హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. మంగళవారం హైదారాబాద్లోని కవిత నివాసానికి వెళ్లిన ఆటా ప్రతినిధులు, టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆమెకు ఆహ్వానపత్రికను అందజేశారు. జూలై 1 నుంచి వాషింగ్టన్ డీసీలో నిర్వహించే ఈ మహాసభలకు దాదాపు 15 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర పెవిలియన్ను ఏర్పాటు చేసి, మన ఊరు-మన బడి, బతుకమ్మ, తెలంగాణ టూరిజం వంటి అంశాలపై చర్చించనున్నట్టు వివరించారు. మన బతుకమ్మ విశిష్టత తెలిసేలా ఇంగ్లిష్లో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు. కవితను కలిసిన వారిలో ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల, ప్రతినిధులు శరత్ వేముల, జయంత్ చల్ల, వేణు సంకినేని తదితరులు ఉన్నారు.