‘ఈ ఏడాది విడుదలవుతున్న నా మూడో చిత్రమిది. ఓ వినూత్నమైన కథను దర్శకుడు అద్భుతంగా డీల్ చేశారు. కొత్త జోనర్స్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువకావాలని ప్రయత్నిస్తున్నా’ అని అన్నారు యువ కథానాయకుడు తేజ సజ్జా. ఆయన కథానాయకుడిగా రామ్ మల్లిక్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘అద్భుతం’. చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించారు. శివాని రాజశేఖర్ కథానాయిక. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ నెల 19న స్ట్రీమింగ్కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ ‘ఓ యూనివర్సల్ సమస్య వల్ల హీరోహీరోయిన్ ఇద్దరికి ఒకే ఫోన్ నెంబర్ ఉంటుంది. అది వాళ్ల పరిచయానికి కారణమవుతుంది. వారి ప్రేమాయణం ఎలాంటి మలుపులు తీసుకుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి కథ ఇది. ప్రేక్షకుల ఊహల్ని తలక్రిందులు చేస్తూ అనేక మలుపులతో కథ సాగుతుంది. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించింది. హీరోగా కథకే నేను తొలి ప్రాధాన్యతనిస్తాను. కథలో నవ్యత ఉంటే ఎలాంటి సినిమా అయినా అంతిమంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే విషయాన్ని నమ్ముతాను. అందుకే కొత్త జోనర్స్ను ఎంచుకుంటూ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నా. అన్ని రకాల ఉద్వేగాలు కలబోసిన విలక్షణ ప్రేమకథగా ‘అద్భుతం’ మెప్పిస్తుంది’ అన్నారు.