హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భారీగా సాగవుతున్న వరిపై టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన విషపు రాతలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కన్నెర్రజేసింది. రాష్ట్రంలో వరి సాగు ద్వారా 10 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సీవో2)కు సమానమైన గ్రీన్ హౌస్ గ్యాస్ (జీహెచ్జీ) ఉత్పత్తి అవుతున్నదని, ఇది 30 కోట్ల వాహనాలు విడుదలచేసే సీవో2కు సమానమని ఆ పత్రికలు పదేపదే సం‘కుచిత’ ప్రచారం నిర్వహించడంపై మండిపడింది. వరి సాగుచేస్తే కాలుష్యమేనని, ఇది ఒక్క తెలంగాణలోనే జరుగుతున్నట్టు అధ్యయనంలో తేలిందని ఆ పత్రికలు మోపుతున్న అపనిందలను తీవ్రంగా ఖండించింది. గోరంతను కొండంతగా చూపి తెలంగాణ రైతులను, ప్రజలను భయపెట్టేందుకు ఆ రెండు పత్రికలు చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టింది. వాటి కథనాల్లోని తప్పులను ఎత్తిచూపి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
నిందలు – వాస్తవాలు
నింద: రాష్ట్రంలో సాగవుతున్న వరి వల్ల 21 కోట్ల వాహనాలు విడుదలచేసే సీవో2కు సమానమైన జీహెచ్జీ విడుదవుతున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నిందించింది. ఇది 30 కోట్ల వాహనాల నుంచి వెలువడే సీవో2కు సమానమని ఆంధ్రజ్యోతి పేర్కొన్నది.
వాస్తవం: ఏదైనా వాహనం 1 కి.మీ. దూరం ప్రయాణిస్తే 120 గ్రాముల జీహెచ్జీ ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన ఆ వాహనం నెలలో 200 కి.మీ. ప్రయాణిస్తే 24 కేజీల సీవో2కు సమానమైన జీహెచ్జీ, సంవత్సరానికి 288 కేజీలకు సమానమైన జీహెచ్జీ వెలువడుతుంది. తెలంగాణలో సాగయ్యే వరి నుంచి వస్తున్న జీహెచ్జీ 2.5 లక్షల వాహనాల జీహెచ్జీకి సమానం.
నింద: రాష్ట్రంలో వరి సాగు వల్ల 10 కోట్ల టన్నుల సీవో2 ఉత్పత్తి అవుతున్నదని రాశారు.
వాస్తవం: అధ్యయనం ప్రకారం ఒక సంవత్సరానికి ఎకరా వరి సాగు ద్వారా 5.65 కేజీల సీవో2 విడుదలైతే.. కోటి ఎకరాల నుంచి 56,500 టన్నుల సీవో2 వెలువడుతుంది. కానీ ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 10 కోట్ల టన్నుల సీవో2 వెలువడుతుందని విషపురాత రాశారు.
కిరణజన్య సంయోగ క్రియలో భాగంగా వరి సీవో2ను గ్రహిస్తుంది. దీనితోపాటు వరి పొలంలో పేరుకుపోయే నాచు కూడా సీవో2ను గ్రహిస్తుంది. కానీ అధ్యయనంలో ఈ రెండు అంశాలను పూర్తిగా విస్మరించారు. కేవలం వరి ఎంత సీవో2 విడుదల చేస్తుందనే అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
ఒక ఎకరం వరి నుంచి 5.65 కేజీల సీవో2కు సమానమైన జీహెచ్జీ విడుదలవుతుందని రాశారు. మళ్లీ అదే వార్తలో మ రో చోట హెక్టారుకు 30,671 కేజీల సీవో2 ఉత్పత్తవుతుందని రాశారు. ఒకేచోట వేర్వే లు అంకెలతో తప్పుడు ప్రచారం చేశారు.
దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం జీహెచ్జీలో వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అవుతున్న జీహెచ్జీ 21% మాత్రమే. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న జీహెచ్జీలో కేవలం 1.1 శాతమే.
ప్రపంచంలో ఎక్కువగా జీహెచ్జీ ఉత్పత్తి చేసే దేశం అమెరికా. భారత్తో పోలిస్తే అమెరికాలో 10 రెట్లు, చైనాలో 4 రెట్లు అధికంగా జీహెచ్జీ ఉత్పత్తి అవుతున్నది.
వరి సాగులో నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా 25 నుంచి 40 శాతం వరకు జీహెచ్జీని తగ్గించే అవకాశం ఉన్నది.