హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచడం, అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించడం తెలంగాణ రాష్ట్రానికి మరింత వన్నె తెస్తుందని పేర్కొన్నారు.
ఈ ఘనత దక్కడానికి కృషి చేసిన అడిషనల్ పీసీసీఎఫ్ ఎం.సీ. పర్గెయిన్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. సమిష్టి కృషితో అనుకున్న ఫలితాలను సాధించగలుగుతున్నామని, మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ఇలాంటి ప్రశంసలు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయని మంత్రి పేర్కొన్నారు.