హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా కార్డియాక్ సర్జరీలో రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ నిర్వహించిన డాక్టర్ లోకేశ్వరరావు సజ్జాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఎల్సివియర్ పబ్లిషింగ్ కంపెనీ వెలువరించే అంతర్జాతీయ జర్నల్ ఆఫ్ సర్జరీస్ ఫిబ్రవరి 2022 సంచికలో డాక్టర్ లోకేశ్వరరావు అధ్యయనాలను ప్రచురించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా కరోనరీ బైపాస్ సర్జరీలో డాక్టర్ లోకేశ్వరరావు జరిపిన ఆధునిక మెటా విశ్లేషణ అధ్యయనాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితం కావడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు.
డాక్టర్ లోకేశ్వరరావును ఆయన అభినందించారు. వైద్య విజ్ఞానరంగంలో నూతన పరిశోధనలు, అధ్యయనాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు డాక్టర్ లోకేశ్వరరావు తెలిపారు. కరోనరీ బైపాస్ సర్జరీలో జరిపిన ఈ ట్రయల్స్ దేశాన్ని ప్రపంచంలో అత్యున్నతస్థాయికి చేరుస్తాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 2003 నుంచి 2020 మధ్య మొత్తం 16 ఆర్సీటీ మెటా విశ్లేషణలు ప్రచురితమైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విశ్లేషణల ప్రకారం భారతదేశంలోని రోగుల సగటు వయస్సు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే తక్కువగా ఉన్నదని, బైపాస్ సర్జరీ చేయించుకుంటున్న రోగుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది మధుమేహ వ్యాధిగ్రస్తులే ఉన్నట్టు తేలిందని వెల్లడించారు. గుండెకు బైపాస్ సర్జరీ చేయడంలో భారతీయ సర్జన్లు ఉత్తమ శస్త్రచికిత్సా నైపుణ్యాలను కలిగి ఉన్నట్టు తెలిపారు. 1,500కు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలను విజయవంతంగా జరిపిన డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా.. సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.