కోపెన్హాగెన్, నవంబర్ 21: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదని ‘ఇంటర్నేషనల్ ఐడియా’ అనే అంతర్ ప్రభుత్వ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా మహమ్మారి కట్టడి పేరుతో పలు దేశాలు అప్రజాస్వామిక, అనవసర చర్యలు తీసుకున్నాయని తెలిపింది. చాలా ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించింది. భారత్లో కూడా ప్రజాస్వామ్యం కోతకు గురైందని పేర్కొంది. ఐ-ఐడియా (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ, ఎలక్టోరల్ అసిస్టెన్స్) స్వీడన్ కేంద్రంగా పనిచేసే సంస్థ. కరోనా నియంత్రణ పేరిట 64 శాతం దేశాలు ‘అసమంజస, అనవసర, అక్రమ చర్యలు చేపట్టాయని ఆ సంస్థ పేర్కొంది. గత దశాబ్దకాలంలో ప్రజాస్వామ్యం విషయంలో వెనుకడుగు వేసిన దేశాల సంఖ్య రెట్టింపు అయిందని తెలిపింది. మొత్తంగా చూస్తే 2020లో నిరంకుశాధికారిత దిశగా వెళుతున్న దేశాలు ప్రజాస్వామిక దేశాల కంటే ఎక్కువయ్యాయని విశ్లేషించింది. ఈ విషయంలో అమెరికా, హంగేరి, పోలాండ్, స్లొవేనియా దేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. గత రెండేండ్లలో ఎన్నికల్లో అక్రమాలు లేదా సైనిక కుట్రల వల్ల ప్రపంచం నాలుగు ప్రజాసామ్య దేశాలను కోల్పోయిందని వివరించింది