న్యూఢిల్లీ, డిసెంబర్ 28: అమెరికా దిగ్గజ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ భారత్లో తయారీ యూనిట్ నెలకొల్పే యోచనలో ఉంది. సెమికండక్టర్ల రూపకల్పన, పరిశోధన, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్రం ప్రకటించిన రూ. 76,000 కోట్ల ప్రోత్సాహకాల్ని ప్రశంసిస్తూ ఇంటెల్ అధికారి ఒక ట్వీట్ చేయడం, వెనువెంటనే ఐటీ మంత్రి ఆహ్వానం పలకడంతో ఆ సంస్థ ఇక్కడ ప్లాంటు పెడుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ‘ఇండియాను ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్స్ హబ్గా మార్చేందుకు సెమికండక్టర్ డిజైన్, తయారీలకు ప్రోత్సాహాకాలు ప్రకటించిన భారత ప్రభుత్వం, ఐటీ మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజీవ్లకు అభినందనలు’ అంటూ ఇంటెల్ ఫౌండ్రీ సర్వీసెస్ ప్రెసిడెంట్ రణధీర్ ఠాకూర్ పోస్ట్ పెట్టారు. అశ్విని వైష్ణవ్ తక్షణ స్పందనగా ‘ఇంటెల్-ఇండియాకు ఆహ్వానం’ అంటూ ట్వీట్ చేశారు.
ఇంటెల్, టీఎస్ఎంసీ, సాంసంగ్లు కావాలి..
ప్రభుత్వం ప్రకటించిన రూ. 76,000 కోట్ల ప్యాకేజీతో అంతర్జాతీయ దిగ్గజాలకు ఇండియాపై ఆసక్తి పెరిగిందని, దేశంలో ఇంటెల్, టీఎస్ఎంసీ, సాంసంగ్, ఇతర సెమికండక్టర్ టెక్నాలజీ దిగ్గజాలు పెట్టుబడులు చేయాలని కోరుకుంటున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.