హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఐఎంఎస్ (ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) మందుల కొనుగోలు కుంభకోణంలో తవ్వేకొద్ది కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ అధికారుల దర్యాప్తులో తాజాగా ‘అవినీతి సంతకాల’ అంశం తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారులుగా ఉన్న ఇద్దరు మహిళా అధికారుల్లో ఒకరు అత్యంత పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపినట్టు తేలింది. ముందస్తు పథకం ప్రకారమే ఆ అధికారిణి పలు ఫైళ్లు, మెడికల్ ఇండెంట్లు, బిల్లులు, నోట్ఫైల్స్పై వేర్వేరు రకాలుగా సంతకాలు పెట్టినట్టు వెల్లడైంది. ఈ కేసులో పట్టుబడిన తర్వాత కూడా ఆమె ఒక్కో సందర్భంలో ఒక్కో తరహాలో సంతకాలు పెట్టినట్టు గుర్తించారు. మొత్తం మూడు రకాలుగా ఉన్న ఈ సంతకాల గుట్టు విప్పడంపై దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు ఇప్పటికే సంతకాలన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా మరిన్ని వివరాలను వెలికితీసి చార్జిషీట్లు వేయాలని భావిస్తున్నారు. ఈ కుంభకోణంలో నిందితులు రూ.211 కోట్లు దండుకొన్నట్టు ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఏసీబీ నిగ్గు తేల్చింది. దీనిపై మొత్తం 8 కేసులు నమోదు చేసింది.