హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఐఎంఎస్ (ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) మందుల కొనుగోలు కుంభకోణంలో ఏసీబీ అధికారులు తవ్విన కొద్ది కొత్త అంశాలు బయటికొస్తున్నాయి. ఐఎంఎస్ అధికారులే డొల్ల కంపెనీలు సృష్టించి, వాటి ద్వారా అధిక ధరలకు మందులను కొన్నట్టు వెలుగులోకి వచ్చింది. కుంభకోణంలో కీలక సూత్రధారులైన అధికారులు కాగితాలపై షెల్ కంపెనీలు సృష్టించుకొని, బిల్లులు కొల్లగొట్టిన వ్యవహారంపై ఏసీబీ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తున్నది. తమ వద్ద పనిచేసే వారి పేర్లు, బ్యాంక్ ఖాతాలను వాడుకొని, నకిలీ చిరునామాలతో వందకు పైగా షెల్ కంపెనీలను సృష్టించినట్టు సమాచారం. ఇందులో దాదాపు 20 కంపెనీలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో మిగిలినవాటి మీద ఏసీబీ దృష్టి సారించినట్టు తెలిసింది.
కేవలం డొల్ల కంపెనీల ద్వారానే కాకుండా గతంలోనే బిల్లులు చెల్లించిన పాత ఇండెంట్లు, ఆర్డర్ల ఒరిజినల్ కాపీల్లోని సంతకాలు మాత్రమే కనిపించేలా కలర్ జిరాక్స్లు తీసి, వాటి ద్వారా కూడా ఇష్టారాజ్యంగా ఇండెంట్లు, బిల్లులు సృష్టించి డబ్బులు దండుకున్నట్టు సమాచారం. సదరు బిల్లులు పాస్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు తమ వద్దే కార్యాలయంలోనే ఉంటాయన్న ధీమాతో ఈ తరహా మోసాలకు తెరతీసినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు ఆయా డాక్యుమెంట్లను చూపినప్పుడు కొన్ని కంపెనీల ప్రతినిధులు, కొందరు కింది స్థాయి ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయినట్టు తెలుస్తున్నది.