Vandemataram Bill | న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ గేయాన్ని అవమానపరిచినా లేదా ఆటంకం కలిగించినా చట్టరీత్యా నేరంగా పరిగణించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన బిల్లును నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్నది. ‘వందేమాతరం’ గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించనున్నది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ (సవరణ)-2026’ బిల్లును సోమవారం రాజ్యసభ ఎజెండాలో చేర్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
సవరణ
ఈ బిల్లును ‘జాతీయ గౌరవానికి అవమానాలను నిరోధించే చట్టం-1971 (Prevention of Insults to National Honour Act)’కు సవరణలు చేయనున్నారు. ఈ చట్టం ప్రకారం.. జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గతం వంటి జాతీయ చిహ్నాలను అవమానించినా లేదా ఆటంకం కలిగించినా, అగౌరపరిచినా నేరంగా పరిగణించి, గరిష్ఠంగా మూడేండ్ల జైలు శిక్ష విధిస్తారు. దీంతో ఈ చట్టాన్ని సవరిస్తూ ‘వందేమాతరం’ను కొత్తగా ప్రభుత్వం చేర్చనున్నది.
150వ వార్షికోత్సవాలు
‘వందేమాతరం’ 150వ వార్షికోత్స వేడుకలు ఏడాది పొడవునా కేంద్రం నిర్వహిస్తుంది. ఈ తరుణంలో జాతీయ గీతం ‘జన గణ మన’కు ఉన్నట్టే జాతీయం గేయం ‘వందేమాతరం’నకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం. ఇప్పటికే జాతీయ గీతాన్ని ఆలపించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయాన్ని కూడా తప్పనిసరిగా వినిపించడం, ఆలపించడం చేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది.